నెల్లికల్ ఎత్తిపోతల పథకం నుంచి ప్రారంభం
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి
24 వేల ఎకరాల ఆయకట్టుకు జలాలు :
శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చెరువుల పూర్తి నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) హద్దులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతామని, జలవనరుల ఆక్రమణలను ఉపేక్షించబోమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో పలువురు సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 2,150గా ఉన్న మత్య్స సహకార సంఘాల సంఖ్య ఆరు వేలకుపైగా పెరిగాయని చెప్పారు. వాటిలో సభ్యత్వం 6.5 లక్షలకు చేరిందన్నారు. అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తయిందని మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లాలోని నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబర్ నాటికి సంపూర్ణంగా పూర్తి చేసి, సుమారు 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. తొలి దశలో వచ్చే ఏడాది జూన్ నాటికి 7,800 ఎకరాలకు, మిగిలిన సుమారు 16 వేల ఎకరాలకు డిసెంబర్ నాటికి నీరందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.25.42 కోట్లు మాత్రమే విడుదల చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రూ.310.681 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. మంత్రిగా తాను రెండు సార్లు ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించానని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న బియ్యం, గోధుమలు, చక్కెరతోపాటు మరికొన్ని నిత్యావసర సరుకులను పంపిణీ చేసే ప్రతిపాదనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు.
చెరువుల హద్దులకు రక్షణ కవచం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



