Wednesday, September 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచెత్త సీసాలకు కొత్త దారి!

చెత్త సీసాలకు కొత్త దారి!

- Advertisement -

ఆరు వేల పాల సీసాల ప్లాస్టిక్‌తో రహదారి నిర్మాణం
మౌలిక సదుపాయంగా రీసైక్లింగ్‌కు పనికిరాని ప్లాస్టిక్‌
చైనా వినూత్న ప్రయోగం.. పర్యావరణవేత్తల హర్షం

షాంఘై : ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్న వేళ చైనాలో చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వినియోగం పూర్తైన ఆరు వేలకుపైగా పాల సీసాలు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలను రహదారి నిర్మాణంలో ఉపయోగించి కొత్త ప్రయోజనం కల్పించారు. సాధారణ రీసైక్లింగ్‌ వ్యవస్థలు సరిగా స్వీకరించని ప్లాస్టిక్‌ను రహదారి నిర్మాణ సామగ్రిగా మార్చడం ద్వారా వ్యర్థాలను మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిం చవచ్చని ఈ ప్రాజెక్టు నిరూపించింది. 2021లో షాంఘైలోని ఈస్ట్‌ చైనా నివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఈసీఎస్‌టీ)లో ఈ ప్రత్యేక రహదారి ప్రాజెక్టును చేపట్టారు. డౌ సంస్థ, పాల ఉత్పత్తుల బ్రాండ్‌ షైనీ మేడో కలిసి విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేశాయి.

రీసైక్లింగ్‌కు ఎందుకు సమస్య?
పాల సీసాలు సాంకేతికంగా రీసైక్లింగ్‌ చేయదగినవే. అయితే వాటిలో మిగిలిపోయే పాల అవశేషాలు ప్లాస్టిక్‌ను కలుషితం చేస్తాయి. దీంతో వాటిని సేకరించి మళ్లీ ఉపయోగించడం రీసైక్లింగ్‌ సంస్థలకు కష్టసాధ్యంగా మారుతుంది. ఈ కారణంగా రీసైక్లింగ్‌ చేయదగిన ప్లాస్టిక్‌ అయినప్పటికీ అనేక సీసాలు తక్కువ విలువ కలిగిన వ్యర్థాలుగా పరిగణించబడుతున్నాయి. షైనీ మేడో సంస్థ ఇప్పటికే రీసైక్లింగ్‌కు అనువైన ప్యాకేజింగ్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ.. వినియోగం తర్వాత సీసాల నిర్వహణ పెద్ద సవాలుగా మారిందని తెలిపింది. ముఖ్యంగా రీసైక్లింగ్‌ సంస్థలు తక్కువ విలువ కలిగి న ప్లాస్టిక్‌గా భావించే సీసాలకు ఉపయోగకరమైన మార్గాన్ని కనుగొనడం అవసరమైంది.

చెత్త నుంచి రహదారికి..
ఈ సమస్యకు డౌ సంస్థ వినూత్న పరిష్కారాన్ని సూచించింది. రీసైక్లింగ్‌కు కష్టంగా ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి, వాటిని వినియోగానంతర రీసైకిల్‌ ప్లాస్టిక్‌గా మార్చింది. అనంతరం ఆ ప్లాస్టిక్‌ను ప్రత్యేక పాలిమర్‌తో మార్పు చేసిన తారు మిశ్రమంలో కలిపి రహదారి నిర్మాణానికి ఉపయో గించారు.ఈ ప్రాజెక్టులో ఆరు వేలకుపైగా ఉపయో గించిన పాల సీసాలతో పాటు ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాల ను కూడా వినియోగించారు. దీంతో సాధారణంగా చెత్తగా మారిపోయే ప్లాస్టిక్‌ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని రహదారిలో భాగంగా మారింది.

తారు వినియోగం తగ్గే అవకాశం
ఈ ప్రాజెక్టు ఉద్దేశం కేవలం ప్లాస్టిక్‌ వ్యర్థాలను మరో రూపంలో మార్చడమే కాదు. రహదారి నిర్మాణంలో రీసైకిల్‌ ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల సంప్రదాయ తారు అవసరాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని డౌ వివరించింది. అదే సమయంలో రహదారి మన్నిక పెరిగితే దాని వినియోగ కాలం కూడా పెరగవచ్చని భావిస్తు న్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణంలోకి చేరకుం డా నిరోధించడం, తారు వినియోగాన్ని తగ్గించడం, రహదారుల సేవా కాలాన్ని పెంచడం వంటి అంశాల ద్వారా గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు, ఇంధన వినియోగం తగ్గే అవకాశముందని సంస్థ తెలిపింది.

ఆసియా దేశాల్లోనూ ప్లాస్టిక్‌ రోడ్లు
షాంఘై ప్రాజెక్టు ఒక్కటే కాదు. ఆసియాలో రీసైకిల్‌ ప్లాస్టిక్‌తో రహదారుల అభివృద్ధిపై డౌ సంస్థ గత కొన్నేండ్లుగా పనిచేస్తోంది. 2017లో ఇండోనేషియాలోని డెపోక్‌ నగరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించి రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అనంతరం భారత్‌లోని పూణేె, బెంగళూరులో భాగస్వాములతో కలిసి ఇటువంటి రహదారి ప్రాజెక్టులపై పనిచేసింది. థారులాండ్‌లోని సియామ్‌ సిమెంట్‌ గ్రూప్‌తో కూడా ఈ రంగంలో సహకారం అందించింది.

విద్యార్థులకు కొత్త ఆలోచనలకు ప్రేరణ
ఈస్ట్‌ చైనా నివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఈ ప్రాజెక్టును కేవలం రహదారి నిర్మాణ ప్రయోగంగా కాకుండా.. పర్యావరణ సమస్యలకు భిన్నమైన పరిష్కారాలను కనుగొనే ఆచరణాత్మక నవనాగా భావిస్తోంది. అసాధారణ ఆలోచనలతో వ్యర్థాల సమస్యలకు పరిష్కారాలు వెతకాలనీ, వాటిని పెద్ద స్థాయిలో అమలు చేసే దిశగా విద్యార్థులు ఆలోచించాలని విశ్వవిద్యాలయం భావి స్తోంది. చెత్తకుప్పల్లో చేరాల్సిన వేలాది పాల సీసాలకు రహదారి రూపంలో కొత్త జీవితం ఇవ్వ డం ద్వారా చైనా చేపట్టిన ఈ ప్రయోగం ఒక కీలక సందేశాన్ని ఇస్తోంది. సరైన సాంకేతికత, వినూత్న ఆలోచన, పరిశ్రమలు-విద్యాసంస్థల భాగస్వామ్యం ఉంటే నేటి వ్యర్థమే రేపటి మౌలిక వనరుగా మారుతుందని ఈ ప్లాస్టిక్‌ రహదారి చాటిచెప్తోందని పర్యావరణవేత్తలు సైతం అభినందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -