Sunday, June 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజనుల హామీల్లో ఒక్కటీ అమలు కాలే..

గిరిజనుల హామీల్లో ఒక్కటీ అమలు కాలే..

- Advertisement -

మైదాన ప్రాంత గిరిజనులకు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌ నాయక్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన 16 రకాల హామీలలో ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌ నాయక్‌ అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మా నాయక్‌ అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి, శ్రీరామ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గిరిజనుల హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి చేవెళ్ల డిక్లరేషన్‌ సభలో ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా అమలు చేయడం లేదని విమర్శించా రు. గిరిజన సంక్షేమ శాఖ రాజ్యాంగబద్ధ అధికారా లు కలిగిన 5వ షెడ్యూల్‌ ప్రాంతంతోపాటు గిరిజనులకు అనేక హక్కులు, చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. గిరిజన ఎమ్మెల్యేలతో కూడిన గిరిజన సలహామండలిని, గిరిజన శాఖ మంత్రిని ఇప్పటివరకు నియమించకుండా అవమానపరుస్తు న్నారని అన్నారు. గిరిజన శాఖ సీఎం దగ్గర ఉండటంతో గిరిజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయన్నారు. ఎస్టీ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కు ప్రతియేటా రూ.500 కోట్లు, అంబేద్కర్‌ అభయహస్తం పథకం ద్వారా ప్రతి ఎస్టీ కుటుంబానికీ రూ.12 లక్షలు, పోడు భూముల సాగుదారులందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో ఐటీడీఏలు ఏర్పాటు చేయాలన్నారు. సమ్మక్క సారలమ్మ గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా గూడెం, తండా గ్రామ పంచాయతీలకు ప్రతి యేటా రూ.25 లక్షలు కేటాయించాలని కోరారు. తండా, గ్రామ పంచాయతీలకు రెవెన్యూ హౌదా ఇచ్చి, తండాల అభివృద్ధి బోర్డు, ఇండ్లు లేని ఎస్టీ కుటుంబాలకు ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.6 లక్షలు ఇవ్వాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకున్న ఎస్టీ అసైన్డ్‌ భూములను తిరిగి లబ్దిదారులకు ఇవ్వాలని, ప్రయివేట్‌ విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రయివేట్‌ పరిశ్రమల్లో రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. పదో తరగతి నుంచి ఉన్నత విద్య అభ్యసించే గిరిజన విద్యార్థికి లక్ష నుంచి రూ.5 లక్షలు ఇస్తామన్న హామీల అమలుకు తక్షణం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు భూక్యా వీరభద్రం, గూగులోత్‌ భీమా సాహెబ్‌, ఎం.బాలు నాయక్‌, చందు నాయక్‌, అశ్వినీ, భూక్యా హరి, ఎర్రా నాయక్‌, అమర్‌ సింగ్‌, బాల్యా నాయక్‌, గోపి, దీప్లా, రాంకుమార్‌, మహిపాల్‌ నాయక్‌, వెంకట్రామ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -