– మోడీ పాలనలో యూటర్న్లు
– ఓట్లు రాల్చని అయోధ్య రాముడు
– ఓబీసీలు, దళితులు దూరమవడంతో మారిన వైఖరి
– కులగణనకు నాడు ససేమిరా… నేడు ఓకే
– లేటరల్ ఎంట్రీ పోస్టుల భర్తీలోనూ వెనకడుగు
రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేతకూ అంగీకరిస్తారా?
అర్బన్ నక్సల్స్ ఆలోచన అన్న నోటితోనే…
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఆయన పాలనలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఆశ్చర్యపరచింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నిఘా వైఫల్యంపై ఆయన అనేక ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కొన్నప్పటికీ జనగణనతో పాటు కులగణననూ చేపడతామని చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి కులగణన ఎజెండా ఈనాటిది కాదు. ఇది గత రెండు దశాబ్దాలుగా ప్రతిపక్షాల డిమాండ్గా కొనసాగుతోంది. అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి సోషలిస్ట్ నేతలతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రతీ వేదిక పైన ఈ డిమాండ్ను వినిపిస్తూనే వచ్చారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక దుర్భలత్వాన్ని మరింత మెరుగైన రీతిలో గుర్తించడంలో ప్రభుత్వానికి కులగణన సహాయ పడుతుందని వారు చెబుతూ వస్తున్నారు. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం ఇటీవలి కాలం వరకూ అందుకు ససేమిరా అంది.
న్యూఢిల్లీ : కులగణనను బీజేపీ వ్యతిరేకిం చడం మాత్రమే కాదు… ఎగతాళి, అపహాస్యం కూడా చేసింది. కుల రాజకీయాలను రెచ్చగొట్టడం ద్వారా దేశాన్ని తిరిగి ఆదిమ కాలానికి తీసికెళుతున్నారంటూ ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశంలో పేదలు, రైతులు, మహిళలు, యువత అనే నాలుగు కుల సమూహాలు మాత్రమే ఉన్నాయని ఆయన తరచూ చెప్పేవారు. ఓ సందర్భంలో ఆయన కులగణన డిమాండ్ను ‘అర్బన్ నక్సల్స్’ ఆలోచనగా అభివర్ణించారు. పలువురు బీజేపీ నేతలు సైతం ఈ కులగణనను ‘విభజన డిమాండ్’ అంటూ తప్పుపట్టారు. కానీ వారంతా ఇప్పుడు అదే నోటితో కులగణన మంత్రాన్ని పఠిస్తున్నారు.
కొంపముంచిన హిందూత్వ బ్రాండ్ రాజకీయాలు
అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతల వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కన్పించింది. బీజేపీకి హిందూత్వ సిద్ధాంతం ఎంతో ముఖ్యమైనప్పటికీ మిత్రులైన నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, చిరాగ్ పాశ్వాన్పై ఆధారపడాల్సి రావడంతో నరేంద్ర మోడీ ఇక ఎంతమాత్రం ఏకపక్షంగా దేశ రాజకీయ గమనాన్ని నిర్దేశించే నాయకుడు కాలేకపోయారు. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి అధికార పగ్గాలు స్వీకరించిన నరేంద్ర మోడీ ఇటు మిత్రపక్షాలు, అటు ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 45 లేటరల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని యూపీఎస్సీని కోరడం సైద్ధాంతిక మార్పునే సూచిస్తోంది.
లేటరల్ ఎంట్రీ నియామకాల్లో రిజర్వేషన్లు వర్తింపజేయకపోవడంపై చాలాకాలంగా విమర్శలున్నాయి. సామాజిక న్యాయం, సాధికారత విషయంలో మోడీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరణ ఇచ్చుకున్నారు. కానీ వాస్తవం అది కాదు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట వేడుక చుట్టూ బీజేపీ ఎన్నికల ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే హిందూత్వ బ్రాండ్ రాజకీయాల కారణంగా ఓబీసీలు, దళితులు చాలా వరకూ బీజేపీకి దూరమయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మోడీ ప్రభుత్వం యూపీఎస్సీకి నోటిఫికేషన్ ఉపసంహరణపై ఆదేశాలు ఇచ్చింది.
పేదల పార్టీగా చాటుకునే ప్రయత్నం
ఆధిక్యత కనబరచని కుల సమూహాలు 2014 నుంచీ మోడీకి వెన్నంటి నిలుస్తున్నాయి. అయితే గత లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తరచుగా కుల ఆధారిత సామాజిక న్యాయం గురించే మాట్లాడింది. కుల ఆధారిత సమీకరణల విషయంలో రెండు ప్రధాన కూటములు వేర్వేరు వైఖరులు ప్రదర్శించాయి. సమాజ్వాదీ, ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రజాస్వామికీకరణ, వనరుల సమాన పంపిణీకి కుల ఆధారిత సంక్షేమ చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డాయి. అయితే బీజేపీ మాత్రం రాజకీయాల్లో, రాజ్యాంగ పదవుల్లో ఆయా కులాల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా ఓబీసీలు, దళితుల్లో అట్టడుగు వర్గాలను తన వైపు సమీకరించుకోగలిగింది. కానీ అదే సమయంలో అట్టడుగు వర్గాల ప్రజలు ఏ ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతున్నారో ఆ సంస్థలను బలహీనపరచింది. ఎన్నికల్లో ఓబీసీలు, దళితులకు టిక్కెట్లు కేటాయించి తానను తాను పేదల పార్టీగా చాటుకునేందుకు ప్రయత్నించింది.
కొంపముంచిన ‘అయోధ్య’
అయితే గత లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ రాజకీయాలు అయోధ్య చుట్టూనే తిరగడంతో దేశంలో ఓ రకమైన కృత్రిమ భావోద్వేగ పూరితమైన వాతావరణం నెలకొంది. కొందరు కాషాయ నేతలు ఓబీసీలు, దళితుల రాజ్యాంగ హక్కులకు ముప్పు కలిగేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. దీంతో ఆయా సమాజాలు బీజేపీకి దూరవ ుయ్యాయి. ఫలితంగా లోక్సభలో బీజేపీ మెజారిటీకి ఆమడదూరంలో నిలవాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత బీజేపీ నేతల వైఖరిలో మార్పు కనిపించింది. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామంటూ పదేపదే ప్రకటనలు గుప్పించారు. తప్పుడు ప్రచారం ద్వారా ప్రతిపక్షాలపై దాడిని పెంచారు. ఈ పరిణామాలు బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని సూచిస్తున్నాయి. సామాజిక న్యాయ రాజకీయాలను తప్పించుకోవడంలో విఫలమవడంతో ఆ పార్టీలో నిస్సహాయత కన్పిస్తోంది.
ముందున్నది అగ్నిపరీక్షే
అనేక దేశాల్లో ప్రజాదరణ పొందిన నేతలు తమ తెలివితేటలను, సామర్ధ్యాన్ని అతిగా అంచనా వేసుకొని చివరికి చతికిలపడిన ఉదంతాలు మనకు ఎన్నో కన్పిస్తున్నాయి. ప్రధానమంత్రిగా మోడీ పదకొండో ఏడాదిని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. ఆయన మూడో పదవీకాలంలో ఇంకా నాలుగేండ్లు మిగిలి ఉన్నాయి. ఆ కాలం నాయకుడిగా ఆయనకు కచ్చితంగా అగ్నిపరీక్షే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రిజర్వేషన్లపై పరిమితిని తొలగిస్తారా?
ఏదేమైతేనేం… కులగణన చేపడతామని ప్రకటించడం ద్వారా రాజకీయాల్లో కుల ప్రాముఖ్యతను మోడీ గుర్తించారు. గతంలో ఆయన ప్రతి సందర్భంలోనూ కులగణన డిమాండ్ను వ్యతిరేకించే వారు. కారణమేదైనా మోడీ తన పట్టు సడలించడం ఇది రెండోసారి. 2020-21లో ఏడాది కాలం పాటు నడిచిన అన్నదాతల ఆందోళన తర్వాత వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఆయన వెనక్కి తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పటికంటే ఇప్పుడు ఆయన చాలా క్లిష్టతరమైన పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. కులగణనకు అంగీకరించడం ద్వారా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలంటూ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న మరో డిమాండ్కు కూడా ఆయన తలొగ్గాల్సి రావచ్చు. రిజర్వేషన్లపై పరిమితిని రాహుల్, ఇతర ప్రతిపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మోడీ దౌత్యపరంగా ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం గ్రూపులు ఏకతాటి పైకి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలన్న డిమాండ్ను ఆయన అంగీకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
పీఛేముడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES