డిగ్రీలు లేని ప్రిన్సిపాలూ, మరో పరిశోధకుడు

Principals without degrees are another researcherకనీస విద్యార్హత లేకుండానే అధ్యాపకుడూ, ప్రిన్సిపాలూ కావొచ్చా? మాస్టర్స్‌ డిగ్రీ లేకుండానే రీసర్చ్‌ ప్రారంభించొచ్చా?- అంటే వీలుకాదు. కానీ, కొందరు ఆ పరిధులు దాటుకుని, దీక్షతో నిరంతర కృషితో వాటిని సాధించగలుగుతారు. ఉదాహరణ ఒకరిద్దరి జీవిత విశేషాలు తెలుసుకుందాం! అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగల వారు కొందరు ఉంటారని తెలుసుకోగలుగుతాం! స్వశక్తితో మేధావులయిన వారు సామాన్యంగా మనకు ఎక్కడా కనబడరు. ఉన్నా చాలా చాలా అరుదు. అలాంటి అరుదైన జీవితం – వ్యక్తిత్వం గలవాడు మన తెలుగు వారిలోనే ఒకరున్నారు. నాలుగో తరగతితో చదువు ఆపేసి, స్వయం కృషితో ఉన్నత విద్యావంతుడయ్యారు. ఒక జర్నలిజం స్కూలుకు చాలాకాలం ప్రిన్సిపాల్‌గా కొనసాగారు ఆయనే రాంభట్ల కృష్ణమూర్తి (24 మార్చి 1920-7 డిసెంబరు 2001) 24 మార్చి 2020కి ఆయన శత జయంతి పూర్తయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక ప్రముఖ జర్నలిస్ట్‌లకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గురువు- లేదా గురుతుల్యులు! ప్రగతిశీల సాహిత్యోద్యమ పునాది నిర్మాణానికి ఆయన ఒక్కొక్క రాయి పేర్చిన అభ్యుదయ కాముకుడు.
తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం తాలూకా అనాతవరం గ్రామంలో జన్మించిన రాంభట్ల స్వయంగా ఇంగ్లీషు, ఉరుదూ, తెలుగు, సంస్కృత భాషలు నేర్చుకున్నారు. ఆయా భాషల్లోని అనేకానేక గ్రంథాలు అద్యయనం చేశారు. ముఖ్యంగా ఒక వైపు సంప్రదాయ గ్రంథాల మీద, మరోవైపు ఆధునిక సాహిత్య ధోరణుల మీద సమానంగా పట్టు సాధించారు. చిన్నచిన్న పనులు చేస్తూ, స్వంత వ్యాపారాలు ప్రారంభించి ధనవంతులైన వారిని మనం చాలా మందిని చూడగలం.కానీ, స్వయంకృషితో ఇంత పెద్ద ఎత్తున విద్యాధనమార్జిన పండితుల్ని చూడలేం. వేదాల్ని, ఉపనిషత్తుల్ని, దర్శనాల్ని క్షుణ్ణంగా చదివి, వాటి ప్రభావంలో పడి, ఒక ఛాందసవాదిగా మారిపోకుండా నిలదొక్కుకుని, అభ్యుదయ వాదిగా నిలబడగలగడం చాలా గొప్ప విషయం. 1943లో హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శి అయి, అదే సమయంలో ఒక ఐదేళ్ళ పాటు ‘మీజాన్‌’ పత్రికలో పనిచేశారు రాభట్ల! 1946లో తొలితరం జర్నలిస్ట్‌ల జీతాల పెంపుకోసం సంఘర్షించారు. 1948లో మద్రాసులోను, విజయవాడలోనూ పలు పత్రికల్లో పనిచేశారు. 1952లో విశాలాంధ్ర పత్రికకు సబ్‌ఎడిటర్‌ అయ్యారు. ఆ రోజుల్లోనే కార్టూన్లు వేయడం, కార్టూన్‌ కవితలు రాయడం ప్రారంభించారు. తెలుగు జర్నలిజంలో అవే తొలిప్రయత్నాలు.
కవి రాక్షస, అగ్నిమిత్ర, కృష్ణ – పేర్లతో ఆరోజుల్లో కనిపించిన రచనలన్నీ రాంభట్ల కృష్ణమూర్తివే!! అవన్నీ ఆయన కలం పేర్లు. జర్నలిస్ట్‌ గనక పత్రికలకు రాయడం మామూలుగా జరిగేదే. కానీ, అంతకు మించి అనేక విషయాల మీద ఆయన ఎన్నో గ్రంథాలు ప్రకటించారు. జనకథ, వేల్పుల కథ, సొంతకథ, శశవిషానం, పాదుటాకులు వంటి గ్రంథాలు చాలా ప్రకటించారు. ఉరుదూ కవి ముగ్దుమ్‌ మొహియుద్దీన్‌ కవిత్వానికి ఆకర్షితులై ఆయన కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు. అలాగే కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ సాంగ్‌ను అదే బాణిలో, పాడుకోవడానికి అనువుగా అనువదించారు. ఇవన్నీ చేస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘానికి మార్గదర్శిగా నిలిచారు. 1973 గుంటూరులో 1977 హైదరాబాదులో జరిగిన అరసం రాష్ట్ర మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నాటి యువతీ యువకుల మెదళ్ళలో అభ్యుదయ బీజాలు నాటి, వారిని రచనా రంగంవైపు నడిపించారు. ఆయన పరిశీలనల్లో, పరిశోధనల్లో ఎప్పుడూ కొత్త చూపు ఉండేది. కొత్త దారులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. చేసే కృషి ఏరంగంలో దైనా, అన్నింటా మార్క్సిస్టు దృష్టికోణాన్ని నిలుపుకోవడం ఆయన ప్రత్యేకత! ఈ విషయాలన్నిటినీ పొందుపరిచి ‘దారిదీపం’ మాసపత్రిక సంపాదకులు డి.వి.వి.ఎస్‌ వర్మ- రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి విశేష సంచికను వెలువరించారు. దానికి అర్వీ రామారావు గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు.
తొలితరం జర్నలిస్ట్‌గా, తొలి కార్టూనిస్ట్‌గా, మార్సిస్టు మేధావిగా గుర్తింపబడ్డ రాంభట్ల ఏం రాశారోనని ఆయన రచనలు జాగ్రత్తగా పరశీలించాను. అప్పుడు తెలిసింది ఆయన నిజంగానే విషయ పరిజ్ఞానం గలవారని! వేదాలు సృష్టి మొదలైనప్పుడే ఉన్నాయని, ఆ భగవంతుడే స్వయంగా మానవుడికి అందించాడని ‘ఊదరగొట్టే వారికి రాంభట్ల వాక్యాలు కొన్ని చూపించదలిచాను. ఆయన ఇలా రాశారు. – ”మన వేద సమాజంలో జర్మన్‌ సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని, వేదకాలం కన్నా ముందే ఈ దేశంలో వర్ధిల్లిన హరప్పా మొహంజాదారో సమాజాల్లో ప్రాచ్య సమాజ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని- ”జనకథలో ఒక చోట చెప్పారు. ఇది ఆధునిక పరిశోధనలు ధృవపరిచిన విషయాల్ని రాంభట్ల కృష్ణమూర్తి ఆరోజుల్లోనే గ్రహించగలిగారు.
ఇంకా ఇలా రాశారు ”మొహంజోదారో సమాజ సంస్కృతుల ప్రభావం వేదాల మీద పడినట్లు వేదాల్లోనే యెన్నో ఆధారాలు కనిపి స్తాయి. ఇప్పుడు రామాయణం చదువుతూ ఉంటే – మెసపటేమియా మొహంజోదారో సమాజం ప్రభావం రామాయణంలో చాలా కనిపిస్తుంది. జుడిషియల్‌ బ్లయిండ్‌నెస్‌ తొలగిపోయిన తర్వాత మన సమాజం కొత్త కాంతులతో కొత్త తేజస్సుతో కనిపిస్తోంది. అందుచేత మార్స్కిజం వెలుగులో మన చరిత్రను తిరిగిచూద్దాం. మన సమాజాన్ని తిరిగి అర్థం చేసుకుందాం. మన కూకటి వేళ్ళను – రూట్స్‌ను- తిరిగి పట్టుకుందాం!” -ఇది రాంభట్ల కృష్ణమూర్తి భావితరాలకు ఇచ్చిన సందేశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది.!
అలాగే, విద్యార్హతలు లేని మరో పరిశోధకుడు ఇప్పుడు మన ఎదుటే ఉన్నాడు. ఆయన పేరు శివశంకర్‌. వృత్తి రీత్యా ముఠాకూలీ అయిన ఒక వ్యక్తి, ప్రవృత్తి రీత్యా చరిత్ర అన్వేషణకు పూనుకున్నాడు, గుంటూరు జిల్లాలో ఐదు వందల అదృశ్య గ్రామాలను గుర్తించి, వాటి గురించిన సమాచారం గ్రంథస్తం చేశారు. మణిమేల శివశంకర్‌ అతి సాధారణ ముఠా కార్మికుడు. లారీ రాగానే బస్తాలు దించడం, లేదా ఎక్కించడం అతని పని. అదే జీవన భృతి. అయినా, అతని మనసు మరొక విషయం కోసం తపిస్తూ ఉంటుంది. తీరిక దొరికినప్పుడల్లా లేదా తీరిక చేసుకున్నప్పుడల్లా అతను శాసనాలు వెతుకుతుంటాడు. వాటి సారాన్ని క్రోడీకరిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇప్పటికి ఎన్నో అదృశ్య గ్రామాల చరిత్రను వెలికితీశాడు. ఇంకా తీస్తూనే ఉన్నాడు. అతను ఉన్నత చదువులు చదివిన వాడు కాదు. ఏ విశ్వవిద్యాలయం నుండి ఏ డిగ్రీ తీసుకున్న వాడు కూడా కాదు. అతి కష్టం మీద అయిదో తరగతి మాత్రం చదివిన వాడు. అయితేనేం? అతను తెలుగు చరిత్ర పరిశోధకుల జాబితాలో చేరిపోయాడు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన మణిమేల శివశంకర్‌కు చదు వుకునే అవకాశం రాలేదు. జీవనోపాధి కోసం తప్పని సరైన పరిస్థి తుల్లో ముఠా కార్మికుడిగా మారాల్సి వచ్చింది. అతని స్వగ్రామం పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం. ఉన్న ఊళ్ళో బతుకు దెరువు లేక జిల్లా కేంద్రం గుంటూరుకు వెళ్ళి అక్కడ స్థిరపడాల్సి వచ్చింది. బాల్యంలో శివశంకర్‌ను పెద్దవాళ్లు ఆలయాలకు తీసుకు వెళ్లినపుడు, ఆ బాలుడి దృష్టి దైవ విగ్రహం మీద ఉందేది కాదు. చుట్టు పక్కల వాతావరణం మీద, శిల్పాల మీద ఎక్కువ శ్రద్ద పెట్టేవాడు. అలాడే అక్కడి స్థానికులను అడిగి స్థల విశేషాలు ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండేవాడు. దగ్గరలో ఏవైనా శాసనాలు కనబడితే వాటిని మెల్లెమెల్లగా చదవడానికి ప్రయత్నిం చేవాడు. క్రమంగా అది అతని ప్రవృత్తిగా మారింది. వయసు పెరిగినా కొద్దీ బాధ్యత మీద పడుతుంది గనక ప్రవృత్తి తిండి పెట్టదు గనక, చదువు పెద్దగా లేదు గనక-మరో మార్గంలేక ముఠా కార్మికుడిగా జీవనోపాధి చూసుకున్నాడు. అయితే వృత్తి ధర్మం పూర్తికాగానే ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోకుండా శాసనాల వెంటపడేవాడు.
పరిశోధన మీద ఆసక్తి పెరుగుతూ ఉండడంతో ఆర్కియాలజీ విభాగం అందుబాటులోకి తెచ్చిన శాసనాలు అధ్యయనం చేయడం ప్రారంభించాడు. పురాతన తెలుగు శాసనాలు చదవడంలో క్రమంగా పట్టు సాధించాడు. సంస్కృత శాసనాలు చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఇతర పెద్దలపై ఆధారపడేవాడు. ఇతనిలోని ఉత్సుకతను గమనించి వారు ఇతనికి సహకరిస్తూ ఉండేవారు. పైగా, మరింతగా ప్రోత్స హించే వారు. ఆవిధంగా మణిమేల శివశంకర్‌లో తెలియకుండానే ఒక పరిశోధకుడు ఎదుగుతూ వచ్చాడు. ఆ రకంగా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి, అక్కడి పెద్దల్ని విద్యావంతుల్ని పలకరించేవాడు. ఊళ్ళ మధ్య గల ఖాళీ ప్రదేశాల్ని, సమీపంలో ఉన్న చిన్న చిన్న ఆడవుల్ని తరచి తరచి చూసేవాడు. ఆనవాళ్ళు ఆధారాలు ఏవైనా దొరుకుతాయేమోనని శోధించేవాడు. ఆప్రయత్నంలో స్థానిక రికార్డుల్ని, కల్నల్‌ మెకంజీ రాతల్ని వెతికి పట్టుకుని అధ్యయనం చేశాడు.
గుంటూరు జిల్లాలో అదృశ్యమైపోయిన సుమారు ఐదు వందల గ్రామాలకు సంబంధించిన ఆధారాలు దొరకబట్టుకుని, వాటి గురించి రాయడం ప్రారంభించాడు. ఫలితంగానే ”గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు” పేరుతో మణిమేల శివశంకర్‌ రచన పుస్తకంగా వెలువడింది. మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య పూర్వీకులకు – అష్టదిగ్గజాల్లో ఒకడైన పింగళి సూరన్నకు,నేటి సినీకవి పింగళి నాంగేంద్రరావులకు – వారి వారి పూర్వీకులకు సంబంధించిన ఇ వృత్తమంతా మణిమేల శివశంకర్‌ వెలికితీశారు.
రెంటాల బ్రహ్మీ శాసనంలో ప్రస్తావించిన ‘నిడిగల్లు” గ్రామం సాధారణశకం మూడవ శతాబ్దం నాటి ఇక్ష్యాకుల రాజధానిగా ఉన్న నాగార్జునుని కోట విజయపురిలో ఉన్నదనడానికి ఆధారం ఇచ్చాడు. అలాగే, దుర్గి మండలంలో అదృశ్యమైపోయిన ‘దద్దనాల పాడు’ ఒకప్పుడు రాజకుటుంబాలలోని స్త్రీలు సతీసహగమనం చేసిన ప్రదేశమని శివశంకర్‌ ఆధారాలు చూపాడు. తెనాలి రామకృష్ణకవి స్వగ్రామం తెనాలి మండలంలోని కొలకటూరుకు సమీపంలో అదృశ్యమై పోయిన ‘గార్లపాడు’ అని ఈ పరిశోధకుడు నిరూపించాడు. ఇతని కృషికి ఆమధ్య ”అయ్యంకి వెలగా పురస్కారం’ లభించింది. ఇలాంటి వారు ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. తాము చేయదలచుకున్న పని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతారు. వివేకవంతులు దయతో ఇలాంటి వారిని వెలికితీసి, సభ్య సమాజానికి పరిచయం చేస్తూ ఉండాలి. ఇలాంటి పరిచయాలు మరికొందరికి స్ఫూర్తినిస్తూ ఉండాలి. గొప్ప పదవుల్లో ఉండి కూడా చేసింది ఏమీ లేక పోయినా, సిగ్గు లేకుండా అంతర్జాతీయ అవార్డుల కోసం ప్రయత్నాలు చేసుకునే హీన మనస్సులు, మీడియా పిచ్చోళ్ళూ ఉన్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా ఎవరినీ పట్టించుకోకుండా సత్యాన్ని అన్వేషించే దిశగా నిరంతరం కృషిచేస్తున్న వారిని తప్పకుండా గుర్తించుకోవాలి! గౌరవించుకోవాలి.
– కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్ర వేత్త
(మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love