న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో రెండో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల గడువు ముగిసింది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 88 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండో విడతలో ఔటర్ మణిపూర్లోని ఒక సీటుతోపాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ స్థానాల్లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జమ్ము కాశ్మీర్ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5న జరుగనుంది. జమ్ములో మాత్రం ఏప్రిల్ 6న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. రెండో విడతలో అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్ముకాశ్మీర్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్థాన్లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. కాగా, మొదటి విడత నోటిఫికేషన్ను మార్చి 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 102 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.