రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు: కలెక్టర్

– ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..
– కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంట మిల్లులకు చేర్చాలి..
– ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలి..
– కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ – డిచ్ పల్లి
రైతులు ఏలాంటి ఆందోళన చేందోద్దని, ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేయాలని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంట రైస్ మిల్లులకు చేర్చాలని, రైతులకు ఏలాంటి ఇబ్బందులు ఉన్న కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు ఆదేశించారు. ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి, తిర్మన్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను నేరుగా పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా ? అని రైతులను ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియచేయాలని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు, లేదా రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చని కలెక్టర్ రైతులకు సూచించారు.
                                                కాగా, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటది వెంట లారీలలో లోడ్ చేయించి  రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలు సేవలందించేలా ఏర్పాట్లు ఉండాలని, రైస్ మిల్లుల వద్ద కూడా ధాన్యం లోడ్ లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావులేకుండా చూడాలని, వాతావరణం అనుకూలించిన వెంటనే సాయంత్రం సమయాలలోనూ ధాన్యం నిల్వలు లిఫ్టింగ్ జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. అకాల వర్షాలను చూసి రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ భరోసా కల్పించారు. తొందరపడి దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని తెలిపారు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా వాతావరణ పరిస్థితుల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ముందస్తుగానే వారిని అప్రమత్తం చేయాలని, తద్వారా ఆరబోసిన ధాన్యం తడవకుండా వారు జాగ్రత్తలు చేపట్టేందుకు వీలుంటుందని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్ లో 466 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ జరుపుతున్నామని, ఎక్కడ కూడా తరుగు, కడ్తా వంటివి లేకుండా గట్టి చర్యలు చేపట్టడం జరిగింది కలెక్టర్ తెలిపారు.కోనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉంచామని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే రైతులు నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తేవచ్చని, జిల్లా స్థాయిలోని కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.  కలెక్టర్ వెంట డీసీఓ ఎన్.శ్రీనివాస్ రావు, డీఎస్ఓ చంద్ర ప్రకాష్, సివిల్ సప్లైస్ డీ.ఎం జగదీశ్, ఇందల్ వాయి తహసిల్దార్ వెంకట్రావు, ఇందల్ వాయి సహకార సొసైటీ చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, సిఈఓ ఉప్పల్ వాయి రతన్, రాంపూర్ సహకార సొసైటీ సిఈఓ నాగరాజ్, డైరెక్టర్ బోక్క గంగాధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, నాగేశ్వర్ రావు,బసాప్రబు, రైతులు తదితరులు ఉన్నారు.
Spread the love