Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకరెంటు కష్టాలు లేకుండా చూస్తాం

కరెంటు కష్టాలు లేకుండా చూస్తాం

- Advertisement -

– సింగరేణి సంస్థ బలోపేతమే లక్ష్యం : ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
– భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభం
నవతెలంగాణ-భూపాలపల్లి

రాష్ట్రంలో కరెంటు ఎంత అవసరం ఉన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,కరెంటు కష్టాలు లేకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. రెండు జోడెద్దులని, సంక్షేమాన్ని వెనుకబడనివ్వమని, అభివృద్ధిని ఆగనివ్వమని తెలిపారు. మంగళవారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్‌ గ్రామంలో రూ.140లక్షలతో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షులు, ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అయిత ప్రకాశ్‌ రెడ్డి, వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మోరంచపల్లి నుంచి మంజూరునగర్‌ వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంజూరునగర్‌లో నవాబుపేట, ధర్మారావుపేట, మంజూరునగర్‌ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో భట్టి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని, గతంతో పోలిస్తే 2,000 మెగావాట్ల అదనపు డిమాండ్‌ వచ్చినా రాష్ట్రంలో ఒక్క నిమిషం అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసిన చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని తెలిపారు. ఉచిత విద్యుత్‌ పథకాల కోసం రాష్ట్ర ప్రజల పక్షాన ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.13,992 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 50వేల కుటుంబాలకు ఉచిత కరెంట్‌ అందిస్తు న్నట్టు చెప్పారు. కాళేశ్వరం పేరిట గత ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చుపెట్టి కట్టిన ప్రాజెక్టు కుంగిపోతున్న విషయాన్ని ఫోటోలతో బయట పెట్టింది జర్నలిస్టులేనని గుర్తుచేశారు. కాళేశ్వరం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని, చూపెట్టిన డిజైన్‌కు, కట్టిన దానికి పొంతన లేదన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు ఏఈ ఆఫీసుల, జిల్లా కేంద్రంలో పవర్‌ సరఫరా కేంద్రం, దుబ్బపల్లి, పరశురాంపల్లి సింగరేణి ప్రభావిత గ్రామాలను తరలించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరగా.. వెంటనే హామీని అమలు చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గోదావరి జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. కాళేశ్వరం నీటిని భూపాలపల్లి జిల్లాకు గత ప్రభుత్వం అందించలేదన్నారు.
సింగరేణి సంస్థ బలోపేతమే లక్ష్యం
అనంతరం సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌, సింగరేణి డైరెక్టర్‌ పా గౌతమ్‌తో కలిసి మంత్రులు భట్టి, శ్రీదర్‌బాబు.. జిల్లాలోని కేటీకే-2ను పరిశీలించారు. అనంతరం జీఎం కార్యాల యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భట్టి మాట్లాడారు. 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం కావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో బొగ్గు రంగంలో సింగరేణి, కోల్‌ ఇండియాలది ఏకచ త్రాధిపత్యమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో మార్కెట్లో పోటీకి తట్టుకొని సింగరేణి నిలబడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సింగరేణి మైన్‌ కార్యక లాపాల వల్ల భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని స్థానికులు తెలిపారని, విచారణ చేయాలని అన్నారు. సింగరేణి మైన్స్‌ కోసం భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన జాబితాపై విచారించి అర్హుల జాబితా పంపాలని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఇటీవల కల్పిం చామన్నారు. ఈ సందర్భంగా సింగరేణిలోని శాశ్వత ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్‌ చెల్లింపు విషయమై చర్చించారు. ఆయా కార్య క్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ కిరణ్‌ ఖరే, టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మల్పూర్‌, డీఈ పాపిరెడ్డి, సింగరేణి జీఎం ఏ రాజేశ్వర్‌ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్మి, ఆర్‌డీఓ రవి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్లు జి.కిష్టయ్య, గుమ్మడి శ్రీదేవి, ఆర్‌టీఏ మెంబెర్‌ సుంకరి రాంచంద్రయ్య, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పిప్పాల రాజేందర్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్‌ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -