అంకిత భావంతోనే ఆధరణ…
వైద్యులకు ఉన్నతాధికారుల ప్రశంసలు…
అశ్వారావుపేట ఆర్.ఎం.ఓ డాక్టర్ విజయ్ కుమార్ కు ప్రశంసలు…
జ్ఞాపిక అందించిన టీవీవీపీ కమిషనర్, కలెక్టర్ లు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంకిత భావంతో పనిచేస్తే ప్రజాధరణ మెండుగా ఉంటుందని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్ అజయ్ కుమార్ అన్నారు. ఆస్పత్రుల్లో వైద్యసేవలు పురోగతి పై గురువారం పాల్వంచలో నిర్వహించిన సమీక్షా సమావేశం వైద్య సేవల్లో అంకిత భావంతో పనిచేస్తూ రోగులకు మెరుగైన చికిత్సలు అందించిన పలువురికి ప్రశంసా పత్రాలు,జ్ఞాపికలు అందించారు.
జిల్లా లోని భద్రాచలం,చర్ల, అశ్వారావుపేట,బూర్గంపాడు, మణుగూరు,ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు.ముందుగా చికిత్స పొంది ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.సిబ్బంది మరింత బాధ్యతగా అంకితభావంతో రోగులకు సేవ చే యాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి సిబ్బంది అద్భుతంగా సేవ లను అందిస్తున్నారని అన్నారు. మారుమూల ప్రాంతాలైన కూడా అంకితభావంతో పని చేసి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని వారి సేవ లను కొనియాడారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది అని, ఆ వృత్తిలో వైద్య సిబ్బందికి మాత్రమే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉందన్నారు.
ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా సేవలు అందించాలన్నారు. జిల్లాలోని అన్ని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్ లు ఇతర వైద్య సిబ్బంది చాలా కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. అనంతరం అశ్వారావుపేట రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రాణాపాయం లో ఉన్న అనేక మంది రోగులను కాపాడిన డాక్టర్ విజయ్ కుమార్ కు ప్రశంసా పత్రం,జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు,అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధా రుక్మిణి, జిల్లాలోని పలు ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు,నర్సింగ్, పారామెడికల్,శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.