కవిత్వమంటే నేల చెప్పే కథలు. ఒక్కోపొరలో ఒక్కో జీవితాన్ని దాచిపెట్టి వచ్చే తరానికి ఒక్కొక్కటిగా విప్పి చెబుతుంది. అందుకే కవిత్వం మట్టివాసనొస్తుంది. గట్టిపడ్డ మట్టిగుండెమీద ఒక్క కన్నీటి చుక్క కురవగానే వర్ణమాల పూలమాలలా గుభాళిస్తుంది. పుట్టమన్నుని ఒంటికి పులుముకున్న వాళ్ళకే ఆ పరిమళం అర్ధమవుతుంది. మట్టిగర్భమంతా కవిత్వమే. ఒక్కో పొరా దాటి ముందుకెళ్తుంటే తాతల తండ్రుల పాదముద్రలు ఎదురొస్తాయి. కానీ ఆ మట్టిపొరల్ని జాగర్తగా విప్పడానికి, దాన్ని కవిత్వం చేయడానికి అక్కడే పుట్టిన కవి కావాలి. ఆ స్వేదగంధాన్ని జాగ్రత్తగా నెత్తికెత్తికుని మనదాకా మోసుకురాగలగాలి. కచ్చితంగా అలాంటి కవే తుల శ్రీనివాస్. ఆయన పోగేసిన మట్టిమాటల ముద్దే ‘చింతల తొవ్వ’.
కవిత్వానికి తెలివుండదు ఉండేది కేవలం మనసే. ఏ గుండె లోతుల్లో అక్షరం మెరుస్తున్నా వెళ్లి అక్కడ వాలుతుంది. చమట చుక్కలు తనువుని శుద్ధి చేసినట్టు ఆ మనసుకీ మనిషికీ మెరుగులు దిద్దుతుంది. దానికి ఈ కవీ ఆయన రాసిన కవిత్వమే నిండైన నిదర్శనం. అంతరాల్లోంచి పొంగుకొచ్చే ఏ మాటైనా అందంగానే ఉంటుంది. కానీ అదే మాట కవి అనుభవించింది కూడా అయితే చదివేవారి కన్నీటి చుక్కని బహుమతిగా గెలుచుకుంటుంది. ఇది మనదేనని గుండెలకి హత్తుకునేలా చేస్తుంది. అలాంటి అపురూపమైన కవితావాక్యం ఇది. పుట్టిన ఊరికి కట్టిన కవితా తోరణం ఇది. గరికపచ్చ పెదాలకి తనువుని ఆనిచ్చి వినే మంద్రమైన సంగీతం ఈ కవిత్వం.
ఉత్సవదీపానికి అలుముకున్న ఉషిల్లపుట్ట లాంటి మనుషులు పల్లె ఒళ్లోనే కనిపిస్తారు. ఇక్కడ ప్రతీ అమ్మ మనసూ పచ్చిపాల కుండే. నాన్న గుండె మల్లె పూల చెండే. ఊరిని చుట్టుకున్న ఏరు అర్ధరాత్రి జానపదమై వినబడుతుంది. పంట కాలువల చెక్కిళ్ళకు పసిపాదాలు ముద్దు బహుమతులవుతాయి. పొలిమేరల్లో మర్రిచెట్టు ఊడలు ఉయ్యాలలూపుతాయి. అమ్మమ్మ నాటిన చెట్లు నాన్నమ్మ కట్టించిన ఇల్లు ఇక్కడి వారసత్వ సంపదలు. నవ్వడం నేర్పించిన ఊరు, కవిత్వం చెబుతుంటే బొడ్రాయి అరుగుల మీద అమ్మ ఒళ్ళో పడుకొని మావిడాల ఎల్లమ్మ కథలు విన్న పసితనాన్ని వెనక్కి తిప్పి చూపిస్తుంది. పసితనాన్ని నిలుపుకున్న పల్లెటూర్లు బతకడం నేర్పించిన రంగస్థలాలు. మట్టిగాథలన్నీ ఈ కవిత్వపు వ్యాకరణంలో ఇతిహాసాలు.
నింగికి రంగులేసే కుంచెలాంటి తాటిచెట్టు దుఃఖపు బొట్లని కారిస్తేనే ఊరికి మైకమొచ్చేది. ఒక్కో దారపుపోగుకూ ఒంట్లో నరాలని కలిపి అల్లితేనే ఊరు బతికి బట్ట కట్టేది. చాకలి బండల చెవులకి ఊపిరితిత్తుల సప్పుళ్ళు వినిపిస్తేనే ఊరు మైల తీర్చుకునేది. వరికోతల నుంచీ రంపపు కోతల దాకా తెగిపడుతున్న బ్రతుకులే ఊరిని కలిపి కుట్టేవి. ఇది శ్రమ జీవన సౌందర్యం. ఇక్కడి చమట చుక్కలు సాయంత్రానికి మల్లె మొగ్గలై విచ్చుకుంటాయి. గాయపడ్డ తనువులు పట్టెమంచెం కోడుకి గోడు చెప్పుకుంటూ నిద్రాకాశంలో చుక్కలవుతాయి.
పల్లెటూర్లు మనిషి నుదురులాంటివి తలపట్టుకున్నప్పుడెల్లా తలుపులని తనువులు దాటించి ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి. ఈ కవితా దారుల్లో తెలియకుండా చిన్నతనానికి జారిపోతాం. ఈ కవిత్వమంతా ఏదో వెతుక్కుంటున్నట్టు, ఎక్కడో తప్పిపోయిన మనిషి తనగురించి తాను తెలుసుకుంటున్నట్టు, వెంపర్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నిన్నటి అడుగులని మర్చిపోని కవిత్వం ఇది. మనిషిని దాటి పోని కవిత్వం ఇది. ఎల్లకాలం నిలబడుతుంది.
చిక్కబడ్డ చీకటినీ, చక్కనమ్మ నుదిటిన బొట్టునీ అక్షరాల్లోకి ఒంపుకునే నేర్పు ఒక్క కవిత్వానికే ఉంది. కల్లు ఒళ్ళుని సల్లబరుస్తున్నట్టు కవిత్వం మనసుని చల్లబరుస్తుంది. కళ్ళు కిందకు జారుతున్న ప్రతీసారీ ఆ మట్టి దారుల్లో మనం ఏటో వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక్కడికి చేరుకునేసరికి ఊరంతా మనతోపాటు కదిలొచ్చి మనపక్కన నిల్చొని కవిత్వం చెప్పమంటుంది. ఈ తొవ్వలో మనిషిమీద ఊరిమీద సమాజంమీద ప్రేమ వర్షంలా కురుస్తుంది. బహుశా అది కవి నిజ స్వరూపం కావచ్చు.
మనిషికీ మట్టికీ మధ్య రాపిడిలో కవిత్వం పుడుతుంది. మనిషి అడవిని కలిసినప్పుడు, ఊరుని కలగన్నప్పుడు, నడుముల దాకా బురదలో కూరుకు పోయినప్పుడు, మట్టిపూల చెట్లని ముళ్ళపూల తొవ్వల్ని మర్చిపోనప్పుడు మాత్రమే గొప్ప కవిత్వం పుడుతుంది. పుట్టి మనిషిని బ్రతికిస్తుంది. చింతల తొవ్వ నిండా గుండెని తడిమే కవిత్వమే. మట్టి పెళ్లల్ని మెత్తటి కాటుక చేసి భూమి కంటికి అలంకరించే శ్రమజీవుల బతుకు కథ ఇది. చిల్లుల దుప్పటిని ఇంటికి కప్పి కష్టాల వానలో ఒంటిని తడుపుకున్న బాల్యపు వ్యధ ఇది. బతుకు బరువును భుజాన మోస్తూ ఒరాలెక్కి దిగే పేద రైతమ్మ బాధల గాథ ఇది. దుఃఖపు రంగులద్దుకున్న సమాజపు ముఖచిత్రం ఈ కవిత్వం.
పచ్చిపాల కుండలాంటి ఈ వాక్యాలు చదువుతుంటే గుండె కరిగి బతుకు అంచుల్లో పెద్దచెరువులా పరుచుకుంటాయి. చెరువుదీపం ఊరిని వెలిగించినట్టు ఈ కవిత్వం మనిషిని వెలిగిస్తుంది. ఈ కవిత్వం చదివి అదే కళ్లతో ఓ మనిషిని చూస్తే ఆ మనిషి మీద గౌరవం ప్రేమ పెరుగుతాయి. ఇంతకన్నా గొప్పగా సాహిత్యం సాధించేదేముంది.
నాన్నని, చిన్నాన్నని, అమ్మని, నానమ్మని, అన్నని అందరినీ.. ఇంకా మాట్లాడితే చెట్టుని, పుట్టని, ఊరిని, ఊరేగించే ముత్యాలమ్మనీ, ముత్తయ్య తాతని, రాములుగాడ్నీ, బీరిగాడ్నీ, మల్లేశాన్నీ, బాలసంతుల్నీ, చిందు నర్సయ్యని, సురేష్ సార్నీ, అరపెల్లి గుట్టనీ, గొల్లకురుమల్ని, గౌండ్లమ్మ నుదిటి బొట్టుని, వీరయ్య తాత చేతికర్రని, పాపిరెడ్డి సారు ప్రేమని, బాయికాడికి పొయ్యే తొవ్వనీ, కుమ్మరి వామునీ, వడ్లోల్ల వాడకట్టనీ, భాగవతుల పాటనీ, బాపనోళ్ల బావి నీటినీ, అట్లాసు సైకిల్నీ, వలస బ్రతుకుల్నీ అందర్నీ కవిత్వం చేసి అక్షర సింహాసనం మీద ఊరేగించాడు ఈ కవి. ఊరి జీవితాల మెడలో వాక్యాలమాలలేసి మనముందు నిలబెట్టాడు. ఇది కేవలం కవిత్వం కాదు తనకి తాను చెప్పుకున్న తన కథ. ఇది తుల శ్రీనివాస్ రాసుకున్న ఆత్మకథ. తనని తాను వెతుక్కుంటూ చింతల తొవ్వలో దొరకబుచ్చుకున్నాడు.
– గౌతమ్ లింగా, 27 630255994
అలుగు పోస్తున్న పల్లె కవిత్వం
- Advertisement -
- Advertisement -