రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని తుంగలో తొక్కి మనువాదాన్ని భుజాన మోస్తున్న కమలం పార్టీ ఏలుబడిలో దళితులకు మిగిలింది అడుగడుగునా అవమానాలు, వేదనలే! బీజేపీ డబులింజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో గూండాలు దారుణంగా పేట్రేగిపోతున్నారు. గత ఏడాది ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒడిశాలో ఇటీవల అలాంటి ఘోరమే వెలుగుచూసింది. గంజాం జిల్లాలో ఆవు, రెండు దూడలను కొనుగోలు చేసి వాహనంలో వాటిని తీసుకెళ్తున్న ఇద్దరు దళితులను అడ్డగించి, వారి మొబైల్ ఫోన్లను, నగదు లాక్కుని, దాడి చేశారు. పశువులను విడిచిపెట్టడానికి రూ.30 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో కట్టేసి, అరగుండు కొట్టించి, దాదాపు రెండు కిలోమీటర్లు రోడ్డుపై మోకాళ్లపై నడిపించారు. బలవంతంగా గడ్డి తినిపించి, మురుగునీరు తాగించారు. కేసు నమోదు విషయంలోనూ పోలీసులు జాప్యం చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఒడిశాలో పెచ్చుమీరు తున్నాయి. మేకలను అపహరించారనే పేరుతో జగత్సింగ్పూర్లో ఇద్దరు దళితులకు గుండు కొట్టించి, చెప్పుల దండవేసి ఊరేగించిన వీడియో ఈ ఏడాది జనవరిలో వెలుగుచూసింది. ఇక యోగి కొలువుదీరిన ఉత్తరప్రదేశ్లోగాని, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో గాని ఇలాంటి ఘటనలకు కొదవే లేదు. లైంగికదాడులు, హత్యలు, నోట్లో చెప్పులు కుక్కడాలు, వారిపై మూత్రం పోయడం, మూత్రం తాగించడం… ఇలాంటి ఎన్నో అమానుష ఘటనలు.
గతేడాది యోగి ఆదిత్యనాధ్ పాలనలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియాలో దళిత బాలురు దొంగతనం చేశారన్న అనుమానంతో తీవ్రంగా కొట్టడంతోపాటు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఐదు కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12 నుంచి 14 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలుర ముంజేతులపై దొంగ అని రాసి ఊరేగించారు. బహిరంగంగా కొట్టడం, ఆలయాల్లోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం నేరం మోపడం, సామూహిక లైంగికదాడులకు పాల్పడటం, హత్యలు చేయడం… లాంటి అమానుషాలు దళితులపై రోజుకు 150కిపైగా జరుగు తున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సిఆర్బి) గణాంకాలే చెబుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుంచి 2022 మధ్య దళితులపై లైంగిక దాడులు 35 శాతం పెరిగాయి. దళితులపై అఘాయిత్యాల కేసులు అధికంగా నమోదవుతున్నది ఉత్తర ప్రదేశ్లోనే. దోషులకు శిక్షలు పడటానికి బదులు సన్మానిస్తున్న ఘటనలే అధికంగా ఉంటుండటం… సంఫ్ు మూకలకు ఊతమిస్తోంది.
సిజెఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవారు తొలిసారి మహారాష్ట్రలో అడుగుపెడితే ప్రోటోకాల్ పాటించకుండా అక్కడి ప్రభుత్వం అవమానించింది. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల ముందు రాజ్యాం గానికి, అంబేద్కర్కు మోకరిల్లుతున్న పోస్టర్లతో రాష్ట్రమంతా ప్రచారం చేసుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఏలుబడిలోనే ఈ ఉదంతం జరగడం మనువాదుల చేతలను తెలిపేదే. ఏడాది పాలన సందర్భంగా పొరుగు రాష్ట్రం ఏపీలో నిర్వహి ంచిన సభకు స్థానిక సర్పంచ్ను వేదికపైకి పిలిచి.. ఆయన దళితుడని తెలియగానే ఆగిపోయిన బీజేపీ ఎమ్మెల్యే తీరు ఈ కోవలోదే. పాలకులే కులవివక్షను ఇంత నిస్సిగ్గుగా పాటించడం రాజ్యాంగానికి వ్యతిరేకమే కాదు అనాగరికం కూడా. ఇటువంటి వారికి పదవుల్లో కొనసాగే హక్కే లేదు. ఎస్సీ,ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్… ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ఇలాంటి ఉదంతాలపై స్పందించడం మాని సనాతన ధర్మం అంటూ మనువాదాన్ని ప్రచారం చేస్తుండటం మరో వైచిత్రి. దళితుల గౌరవాన్ని తుంగలో తొక్కే ప్రతి సంఘటనా రాజ్యాంగంపై దాడే. సమానత్వం, న్యాయం, మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, మహిళలు వంటి అణగారిన తరగతులకు సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రభుత్వాల విధి. కాని, పాలక పార్టీల నేతలు, అనుయాయులే దాష్టీకాలకు పాల్పడడం దారుణం. సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా బాధితులు ఎదురుతిరగడం, పురోగామి శక్తులు వారికి తోడ్పాటునందించడం తప్ప వేరే మార్గం లేదు.
‘డబులింజన్’ ఘోరాలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES