– గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల డిమాండ్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల కంటే ముందుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని పలువురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పరుగులు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు.2023 సెప్టెంబర్ మాసంలో గెజిటెడ్ హెడ్మాస్టర్ గా మొట్టమొదటిసారి మల్టీ జోన్ లో పదోన్నతి పొంది నిజామాబాద్ జిల్లా లోని వివిధ ఉన్నత పాఠశాలలలో పలువురు గెజిటల్ ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు అన్నారు.
స్వస్థలాలకు దూరంగా రావడం వల్ల వృద్ధ తల్లిదండ్రులు, భార్య పిల్లల్ని వదిలి మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో పనిచేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.గత రెండు విద్యాసంవత్సలుగా (2023-24,2024-25) ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, విద్యాభిమానులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సహకారంతో పాఠశాలల్లో ఎన్రోల్మెంట్, నాణ్యమైన విద్య అందించుటలో, ఫలితాల సాధనలో నిజామాబాద్ జిల్లాలో కమ్మర్ పల్లి మండలం ఉత్తమ స్థానంలో ఉండటంలో కృషి చేస్తున్నారన్నారు. ఈ దశలో పత్రికల ద్యారా రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ హెడ్మాస్టర్లకు బదిలీలు జరపకుండా స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లు గా పదోన్నతి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. మొట్టమొదటిసారిగా మల్టీ జోన్ లో స్థానిక జిల్లాల నుండి ప్రమోషన్ తీసుకోని ఇక్కడికి రావడం జరిగిందన్నారు.
ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు మాత్రమే ఇస్తే మేము స్వస్థలాలకు దూరంగా రిటైర్డ్ కావలసి వస్తుందన్నారు. దీంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆలోచించి గెజిటెడ్ హెడ్మాస్టర్ల బదిలీల తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలంలోని చౌట్ పల్లి, బషీరాబాద్, ఉప్లూర్, కోనాపూర్, కోన సముందర్ ఉన్నత పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నేర ఆంధ్రయ్య, కనుక గంగాధర్, కత్రోజ్ రాజన్న, చౌడారపు రామ్ ప్రసాద్, బద్రి మధు పాల్, తదితరులు పాల్గొన్నారు.