– ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల ప్రసాద్
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి పరిశీలన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్ కోరారు. బుధవారం మండలంలోని నాగాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు.
ఇందిరమ్మ గృహాలను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారుల సహకారంతో ఇండ్ల నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం లేకుండా, వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపు విషయంలో లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తారని, వాటిని సద్వినియోగం చేసుకొని ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఆయన వెంట ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.