అధికారులను ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ళకి సంబంధిత శాఖల అధికారులు ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ళకి సంబంధిత శాఖల అధికారులు ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం పిఎసిఎఎస్, ఐకెపి, మెప్మా ద్వారా 414 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. సన్న రకం దొడ్డు రకం కలిపి నాలుగు లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ ఏ రకం రూ. 2389, కామన్ రకం రూ. 2369 గా ఉందన్నారు. హార్వెస్టింగ్ మొదలయ్యేనాటికి వరి ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు.
వరి కొనుగోలు పీపీసి ఇన్చార్జిలకు కమిషన్ విడుదల:
ఖరీఫ్ 2023 -24 సీజన్ కు సంబంధించి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేసిన పిపిసి ఇన్చార్జిలకు క్వింటాలుకు రూ. 32 చొప్పున రూ. 6.06 కోట్ల కమిషన్ మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా రబీ 2023 24 సీజన్ కు సంబంధించి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేసిన పిపిసి ఇన్చార్జిలకు క్వింటాలుకు రూ. 32 చొప్పున రూ.2.79 కోట్లు కమిషన్ మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన చెక్కులను పౌరసరఫరాల డిఎం, పౌరసరఫరాల అధికారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల డిఎం జగన్మోహన్, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డీఏవో ఆంజనేయులు గౌడ్, డి సి ఓ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.