సత్యానికి, అబద్ధానికి మధ్య తేడాను గమనించాలి

–  విలేకర్ల అవగాహన కార్యక్రమంలో రిటైర్డ్‌ జడ్జి రాజేందర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సత్యానికి, అబద్ధానికి మధ్య తేడాను గమనించి వార్తలు రాయాలని రిటైర్డ్‌ జడ్జి మంగారి రాజేందర్‌ చెప్పారు. తమ మనోభావాల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణపై పరువునష్టదావా వేస్తామంటే కుదరదనీ, మూడో వ్యక్తి కూడా ఉండాలని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని నవతెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఎడిటర్‌ ఆర్‌ సుధాభాస్కర్‌ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర, జిల్లాస్థాయి విలేకర్లు, డెస్క్‌ ఇంచార్జీల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి భావప్రకటనా స్వేచ్ఛ ఉందనీ, దానికి పరిమితులు కూడా ఉన్నాయనీ, వాటిని దాటితేనే పరువునష్టదావా ముందుకు వస్తున్నదని తెలిపారు. పరువునష్టదావాను పోలీస్‌స్టేషన్‌లో స్వీకరించరనీ, నేరుగా కోర్టులో చూసుకోవాలని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా, కావాలని పరువు దెబ్బతీసేలా ఉండకూదదని సూచించారు. వార్తలు ప్రచురించడంలోనూ, ప్రసారం చేయడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర నాయకులు పార్ధసారధి, మొఫిసిల్‌ ఇంచార్జి జి వేణుమాధవరావు, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నరేందర్‌రెడ్డి ఉన్నారు.

Spread the love