సెక్యూరిటీ సిబ్బంది వేతన సమస్యలను పరిష్కరిస్తాం

Security personnel
We will solve the wage problems– సిబ్బందికి ఉచిత వైద్య సేవలు
– మహిళా సిబ్బంది రక్షణకు ప్రత్యేక కమిటీ : నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప
– సెక్యూరిటీ ఏజెన్సీలతో సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పల్రిలో ఏజెన్సీల ద్వారా పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది వేతనాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆస్పత్రి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప చెప్పారు. ఆస్పత్రి లెర్నింగ్‌ సెంటర్‌లో ఆదివారం ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా టెండర్లు దక్కించుకున్న కార్తీక సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా 140 మంది సిబ్బందిని నియమించారు. 12 మంది మాజీ సైనిక అధికారులను సెక్యూరిటీ ఆఫీసర్స్‌గా నియమించారు. వారిని ఉద్దేశించి డైరెక్టర్‌ బీరప్ప మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ఆస్పత్రి ప్రాంగణంలో వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ చేయకుండా నిర్దేశించిన పార్కింగ్‌ స్థలంలో నిలిపేలా సూచనలు చేయాలన్నారు. ఏజెన్సీలు వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలాంటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బందికి విధి నిర్వహణలో ఏదైనా అనారోగ్య సమస్యలు, అత్యవసర వైద్యం అవసరమైతే ఉచితంగా అందిస్తామని చెప్పారు. మహిళా సిబ్బందిని ఎవరైనా వేధిస్తే కఠిన చర్యలు తీసుకునేలా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశామని, ఎవరికైనా సమస్య వస్తే ఆ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్లు లక్ష్మి భాస్కర్‌, కృష్ణారెడ్డితో పాటు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love