టీయుఎంహెచ్ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జాతీయ ఆరోగ్య పథకం (నేషనల్ హెల్త్ మిషన్) పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ – సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియొద్దీన్, కె.యాదానాయక్, నాయకులు ఎండి సాదుల్లా, రమణ, వైకుంఠం శనివారం రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ హెచ్ఎం ఉద్యోగులందరూ సమ్మెలో ఉన్నారని వారు తెలిపారు. దీనిపై డీహెచ్ సానుకూలంగా స్పందిం చారు. ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఎన్హెచ్ఎంలో పని చేస్తున్న దాదాపు 17 వేల మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి – సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 510 జీవో అమలుకాని క్యాడర్లకు కూడా బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ తదితరాలను కలిపి గ్రాస్ శాలరీ నిర్ణయించాలనీ, హెచ్ఆర్ పాలసీని రూపొందించా లని కోరారు. మెడికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల్లో అత్యధికులకు రాష్ట్ర ప్రభుత్వ పీఆర్సీ ప్రకారం జీతాలు అమలు కావడం లేదని తెలిపారు. గతంలో జీవో నెంబర్ 510 ద్వారా దాదాపు 10 వేల మంది వరకు డాక్ల్రు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్ఎం తదితరులకు బేసిక్ ప్రకారం వేతనాలు నిర్ణయించి చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. ఇందులో కొన్ని క్యాటగిరీలకు పర్మినెంట్ ఎంప్లాయీ బేసిక్ కన్నా తక్కువగా చెల్లిస్తున్నారనీ, మిగిలిన 7 వేల మంది కనీస బేసిక్ కాకుండా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. వీరందరికి కనీస వేతనం డీఏ, హెచ్ఆర్ఏ తదితర అలవెన్సులు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు అమలు కాకుండా వేతనాలు పొందుతున్న క్యాడర్లలో అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న పారామెడికల్ సిబ్బంది, అకౌంటెంట్స్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పబ్లిక్ హెల్త్ మేనేజర్ (కమ్యూనిటీ ఆర్గనైజర్స్), సపోర్టింగ్ స్టాఫ్లోని మెడికల్ అసిస్టెంట్లు, వాచ్మెన్, స్వీపర్లు, బస్తీ దవాఖానాల్లో పని చేసే స్టాఫ్ నర్సులు, సపోర్డింగ్ స్టాఫ్ తదితరులున్నారు.
ఆయా విభాగాల వారీగా తక్కువ వేతనం పొందుతున్న వారికి క్యాడర్ ప్రకారం పర్మినెంట్ ఉద్యోగుల బేసిక్, అలవెన్సులు నిర్ణయించాలని వారు కోరారు.