అలిశెట్టి కుటుంబానికి డబుల్‌బెడ్‌ రూమ్‌

– కేటాయించిన కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ కవి, అలిశెట్టి ప్రభాకర్‌ కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందనీ, ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి అలిశెట్టి అని పేర్కొన్నారు. తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే అభ్యుదయ కవి అని కొనియాడారు. నాటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేటి జగిత్యాల జిల్లా కు చెందిన అలిశెట్టి ప్రభాకర్‌ చిత్రకారుడుగా, ఫోటోగ్రాఫర్‌ గా అభ్యుదయ కవిగా సమాజం కోసం నిరంతరం శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసాడ న్నారు. మనసున్న ప్రతి మనిషిని తన కవిత్వంతో కదిలించాడని తెలిపారు. నాటి ఉమ్మడి పాలనలో సామాన్యులకు జరిగే అన్యాయాల పై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అని పేర్కొన్నారు. దారితప్పిన సామాజిక పోకడలను పదునైన పదాలతో కూడిన సునిశిత వ్యంగ్యంతో సరిదిద్దే ప్రయత్నం చేశాడన్నారు. పేదరికం మీద, మహిళా సమస్యలమీద, పల్లె పట్నం బాధల మీద సమస్త సామాజిక రంగాలలోని అసమానతలు, అన్యాయాల మీద తన కవితల బాణాలను గురిపెట్టి కొడుతూ సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల తరఫున బాధ్యత కలిగిన సైనికుడుగా అక్షర పోరాటం చేసినవాడ న్నారు. సమాజం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి తనువు చాలించిన కవి అలిశెట్టి భార్య, పిల్లలు కుటుంబం నేడు పేదరికంలో మగ్గుతుండడం, భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నదని తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ అలిశెట్టి కుటుంబానికి సరియైన విధంగా సహాయం అందించే చర్యలు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు దివంగత అలిశెట్టి ప్రభాకర్‌ భార్య భాగ్యమ్మ పేరుతో అసీఫ్‌ నగర్‌లోని జియాగూడలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూంల సముదాయంలో వొకదానిని కేటాయిస్తూ, హైద్రాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తమకు డబుల్‌ బెడ్‌ రూం కేటాయిం చినందుకు అలిశెట్టి ప్రభాకర్‌ భార్య భాగ్యమ్మ, కుమారులు సంగ్రామ్‌, సంకేత్‌ సహా ఇతర కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love