వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు

 

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ఎప్పటికప్పుడు తన కొత్త ఫీచర్లు కస్టమర్ల కోసం జోడిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సదుపాయాన్ని తీసుకొచ్చిన ఈ యాప్‌.. మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమవుతోంది. ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్‌ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అంటే ఇకపై నెట్‌వర్క్‌తో సంబంధం లేకున్నా మీ డాక్యుమెంట్లను పంపించొచ్చన్నమాట. బ్లూటూత్‌ సాయంతో షేర్‌ఇట్‌, నియర్‌ బై షేర్‌ వంటి అప్లికేషన్ల  తరహా సేవల్నే వాట్సప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల ఎటువంటి ప్రత్యేక యాప్‌ వినియోగించాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్‌ ఎనేబల్‌ చేసుకోవాలంటే వాట్సప్‌ సిస్టమ్‌ ఫైల్‌, ఫొటోల గ్యాలరీ యాక్సెస్‌ లాంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పంపించాలనుకుంటున్న వ్యక్తి మొబైల్‌ బ్లూటూత్‌ కనెక్ట్‌ అయ్యేంత దగ్గర్లో ఉంటేనే ఆఫ్‌లైన్‌ షేరింగ్‌కు వీలవుతుంది. బ్లూటూత్‌ ఆన్‌ చేసి దగ్గర్లోని వాట్సప్‌ యూజర్‌ పరికరాన్ని గుర్తించి ఫైల్‌ సెండ్‌ చేయాలి. అవతలి వ్యక్తి అనుమతి ఇస్తేనే ఈతరహా షేరింగ్‌ సాధ్యమవుతుంది. వద్దనుకుంటే ఆఫ్‌ చేసే సదుపాయం కూడా ఉంది.

 

Spread the love