కిడ్నీ మార్పిడి జరిగిన రోగి వృషణాల్లో అరుదైన కణితి

– 40 సెంటీమీటర్ల పొడవు, డంబెల్‌ ఆకారంలో కణితి
– సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
యువకుడి వృషణాల్లో అత్యంత అరుదైన, పెద్ద డంబెల్‌ ఆకారంలోని కణితిని బంజారా హిల్స్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఇప్పటికే ఈ రోగి కిడ్నీ మార్పిడి చేయించుకుని, ఇమ్యునోసప్రెసెంట్‌ మందులు ఎక్కువ మోతాదులో వాడుతుండటంతో శస్త్రచికిత్స బాగా సంక్లిష్టంగా మారింది. ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని కడప నగరానికి చెందిన 39 ఏండ్ల వ్యక్తికి ఏడాది క్రితం మూత్రపిండాలు పూర్తిగా విఫలం కావడంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి అతడు శక్తిమంతమైన స్టెరాయిడ్లు, ఇమ్యునోసప్రెసెంట్లు వాడుతున్నాడు. ఇటీవల అతడికి ఎడమవైపు వృషణం వాపు వచ్చింది. ఈ వాపు క్రమంగా పెరిగిపోతుండటంతో స్థానిక వైద్యుల సూచన మేరకు ఏఐఎన్‌యూలో చూపించుకున్నాడు. ఎడమ వృషణం నుంచి బొడ్డు మీదుగా ఉదరభాగం వరకు పెద్ద కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడి బీటా హెచ్‌సీజీ స్థాయి అసాధారణంగా పెరిగిపోయింది. రోగికి జనరల్‌ ఎనస్థీషియాలో ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. కన్సల్టెంట్‌ యూరో-ఆంకాలజిస్టు డాక్టర్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి అడపాల నేతత్వంలో డాక్టర్‌ దినేష్‌ సహకారంతో శస్త్ర చికిత్స చేశారు. డాక్టర్‌ నిత్యానంద, డాక్టర్‌ షిఫా నేతత్వంలో ఎనస్థీషియా బృందం సహకరించారు. అత్యంత జాగ్రత్తగా, విజయవంతంగా కణితిని తొలగించారు. దాదాపు 40 సెంటీమీటర్ల పొడవు, డంబెల్‌ ఆకారంలో ఉన్న ఈ కణితిని వీలైనంత తక్కువ రక్తస్రావంతో తొలగించడం విశేషం. రోగిని తొలుత ఐసీయూలోకి తరలించి, మూడోరోజు డిశ్చార్జి చేశారు. ”వృషణాల్లో కణితులు యువకుల్లో సాధారణమే. కానీ అవి ఇంత పెద్ద పరిమాణంలో పెరిగి ఉదరభాగం వరకు వెళ్లడం మాత్రం చాలా అరుదు” అని డాక్టర్‌ అడపాల తెలిపారు. తమ బృందం సాధించిన ఈ అసాధారణ విజయం పట్ల ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీసీ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love