వర్గ పోరాటాలతోనే దోపిడీ లేని సమాజం సాధ్యం

With class struggles A society without exploitation is possible– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– మార్క్స్‌ ఆశయమైతే లెనిన్‌ ఆచరణ
– పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా విఐ లెనిన్‌ శత వర్ధంతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం వర్గ పోరాటాలను బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆదివారం నాడిక్కడ సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం (ఏకేజీ భవన్‌)లో కామ్రేడ్‌ విఐ లెనిన్‌ శత వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత సీపీఐ(ఎం) నేతలు లెనిన్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ లెనిన్‌ తన 54 సంవత్సరాల స్వల్ప జీవితంలో ప్రపంచంలోనే మొదటి దోపిడీ రహిత సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించి, మానవ చరిత్రను తిరుగులేని విధంగా మార్చగలిగారని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడంతో పాటు దోపిడీలేని సమాజాన్ని నిర్మించిన వ్యక్తి లెనిన్‌ అన్నారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ప్రపంచాన్ని మార్చడం కూడా సాధ్యమేనని నిరూపించిన గొప్ప నాయకుడు లెనిన్‌ అని కొనియాడారు. అందుకే దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విప్లవకారులందరికీ లెనిన్‌ స్ఫూర్తి అని తెలిపారు. దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడానికి భారతదేశంలో వర్గ పోరాటాలను బలోపేతం చేసే ప్రయత్నాలను తీవ్రతరం చేస్తామని తాము ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. అయోధ్య ప్రతిష్ట రోజున సెలవు ఇవ్వటాన్ని ఖండిస్తున్నామనీ, మతపరమైన కార్యక్రమంలో ప్రభుత్వం పాల్గొనడం సరికాదని చెప్పారు.
అయోధ్యలో రామ ప్రతిష్ట రోజున కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏచూరి తప్పుపట్టారు. ఒక మతానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించడం దారుణమన్నారు. ప్రభుత్వ సంస్థలు మూసివేయడం మంచిది కాదని, అందులోనూ ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఎయిమ్స్‌కూ సెలవు ప్రకటించడం దారుణమన్నారు. మతపరమైన విధితో పాలనను కలపడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఈ మూసివేత చర్య పూర్తిగా అమానవీయమని పేర్కొన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించాలని ప్రధాని మోడీ ఒత్తిడి తేవడం దారుణం. రాష్ట్రాలకు పన్నుల వాటా కేటాయింపును తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నట్టు వచ్చిన వార్తలపై ఏచూరి విస్మయం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని ఇండియా ఫోరం దృష్టికి తీసుకువెళుతామని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాను తగ్గించేందుకు రహస్య వ్యూహాన్ని అమలు చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై కేరళ ఏండ్ల తరబడి లేవనెత్తుతున్న ఆర్థిక సమస్యలు సరైనవేనని బివిఆర్‌ సుబ్రహ్మణ్య ప్రకటన రుజువు చేస్తున్నదన్నారు. కేరళను కేంద్రం ఆర్థికంగా కుంగదీస్తున్నదని ఏచూరి విమర్శించారు.
కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు 42శాతం కాకుండా 32 శాతానికి తగ్గించాలని ప్రధాని పట్టుబట్టినట్టు వెల్లడికావడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఇది రాజ్యాంగ సంస్థ అయిన ఫైనాన్స్‌ కమిషన్‌ పని, సిఫారసుల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా, రోజువారీ ఆర్థిక వ్యవహారాలను ప్రభావితం చేసే నిర్ణయాలను కూడా అమలు చేస్తుందన్నారు.
పన్ను వాటాను తగ్గించే ప్రయత్నాలు విఫలమైనప్పుడు వివిధ కేంద్ర పథకాలకు కేటాయింపుల్లో కోత పెట్టేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. ఆ తరువాత సెస్‌, సర్‌చార్జ్‌లను పెద్దఎత్తున పెంచడం ప్రారంభించారని, కేంద్ర పన్నుల ఆదాయంలో సెస్‌, సర్‌ఛార్జ్‌లను 28 శాతానికి పెంచారని తెలిపారు.
దీని ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్ను వాటాను తగ్గించే రహస్య వ్యూహం అమల్లోకి వచ్చిందన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదన్న కేరళ ప్రభుత్వం మాట వాస్తవమేనని ఇలాంటివి స్పష్టం చేస్తున్నాయన్నారు.
రాష్ట్రాలకు కేంద్ర ఆదాయ కేటాయింపులు, రుణాల మంజూరులో భారీ కోత విధిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పన్నుల విధానంలో మార్పులు రాష్ట్ర వనరులను హరిస్తున్నాయని అన్నారు. ఇవన్నీ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో లేవనెత్తుతున్న అంశాలనీ తెలిపారు. లెనిన్‌ శత వర్ధంతి కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు నిలోత్పల్‌ బసు, కేంద్ర కమిటీ సభ్యులు జోగేంద్ర శర్మ, హన్నన్‌ మొల్లా, సీపీఐ(ఎం) ఢిల్లీ కార్యదర్శి కెఎం తివారీ, ఏఐకేఎస్‌ నేత కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love