– బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలపై బృందా కరత్, మరియం ధావలే వ్యాఖ్య
– బాధితులకేదీ సాయం?
– సీఎం బీరేన్ సింగ్ను తక్షణమే తొలగించాలి
– గవర్నర్ ఆందోళన సముచితమే
– రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరాం
న్యూఢిల్లీ: ఈ రోజు మణిపూర్లో జరిగిందీ, రేపు దేశంలో మరొక చోట పునరావృతం కావచ్చని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కరత్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పేర్కొన్నారు. మణిపూర్ అల్లర్ల కారణంగా ఉద్యోగా aలు, ఆదాయాన్ని కోల్పోయిన వారికి తక్షణమే ఆహారం, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9 నుంచి 11 వరకు మండుతున్న మణిపూర్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఐద్వా బృందం బుధవారం నాడిక్కడ పండిట్ రవి శంకర్ శుక్లా మార్గ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మణిపూర్ లో మూడు నెలలకు పైగా సామాన్య ప్రజల జీవనం స్తంభించిపోయిందని, భౌగోళికంగా, మానసికంగా మణిపూర్ రెండుగా విడిపోయి వుందన్నారు. ఎవరూ పనికి వెళ్లలేరని, బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. చాలా కుటుంబాలకు ఒక పూట మాత్రమే భోజనం ఉంటుందని, అందరికీ 10 కిలోల ధాన్యం, ఇతర ఆహార పదార్థాలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఆధార్ అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేతలు కోరారు. మణిపూర్లో శాంతికి అతిపెద్ద అవరోధం న్యాయం నిరాకరించడమనీ, న్యాయపాలనకు ప్రధాన అడ్డంకి ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అని విమర్శించారు. మణిపూర్లో కులం, మతం ఆధారంగా మహిళలపై దాడులు జరిగాయని, వారికి న్యాయం జరగాలని అన్నారు.
శాంతి స్థాపనకు తొలి అడుగుగా బీరెన్ సింగ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. భారత్ మణిపూర్తో ఉందని ప్రధాని మోడీ చెప్పడం సరికాదన్నారు. భారతదేశం, భారతీయులు మణిపూర్తో ఉన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ మణిపూర్తో లేరని అన్నారు. మణిపూర్ను బీజేపీ మోసం చేసిందని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మణిపూర్ గవర్నర్ స్పందిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారనీ, కానీ ఏమీ జరగలేదని అన్నారు. మణిపూర్ పరిణామాలను రాష్ట్రపతికి వివరించేందుకు సమయం కోరామన్నారు.