మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌కు కన్నీటి వీడ్కోలు

మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌కు కన్నీటి వీడ్కోలునవతెలంగాణ-ఉట్నూర్‌
మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. భౌతికంగా తమతో లేకపోయినా గొప్ప నాయకుడిగా తమ హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారని ఈ సందర్భంగా పలువురు తెలిపారు. జెడ్పీ చైర్మెన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ఎంపీ గోడం నగేష్‌, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రమేష్‌ నివాసం నుంచి ఉట్నూర్‌ ఎక్స్‌రోడ్డులోని తమ వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్రను నిర్వహించి, అక్కడ అంతక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, వెడ్మ బొజ్జు పటేల్‌ మాట్లాడారు. రాథోడ్‌ రమేష్‌ లేరన్న వార్త జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఒక గొప్ప నాయకుణ్ని కోల్పోయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు పదవుల్లో జిల్లాకు చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని నలుములల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా అంతక్రియలకు హాజరయ్యారు. ఈ అంతక్రియల్లో ఎమ్మెల్యే పాయల శంకర్‌, జోగు రామన్న, మాజీ ఎంపీ సోయం బాపురావు, రాథోడ్‌ బాపు రావు, ఎమ్మెల్సీ దండే విఠల్‌, లంబాడా జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షులు జాదవ్‌ నరేష్‌, ప్రధాన కార్యదర్శి బానోత్‌ జగన్‌, శ్రీరామ్‌ జాదవ్‌, జాదవ్‌ గోపాల్‌రావు, నారాయణ్‌, ఈశ్వరి బాయి, బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Spread the love