మంత్రి వేముల మాతృ మూర్తి మంజులమ్మకు కన్నీటి వీడ్కోలు

– పుష్పాంజలి ఘటించిన సీఎం కేసిఆర్, మంత్రులు, పలువురు ప్రముఖులు
 నవతెలంగాణ కమ్మర్ పల్లి 
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృ మూర్తి మంజులమ్మ అంత్యక్రియలు శుక్రవారం వారి స్వగ్రామం వేల్పూర్ లో జరిగాయి. వేల సంఖ్యలో ప్రజలు వేముల కుటుంబం అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంజులమ్మకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో వేల్పూర్ కు వచ్చి మంజులమ్మ పార్థివ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మంజులమ్మ అంతిమ యాత్ర వేలాది మంది జనం మధ్య సాగింది.ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్న పిల్లల వలె తల్లి పార్థివ దేహం వద్ద వెక్కెక్కి ఏడ్చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
నివాళులు అర్పించిన  ప్రముఖులు…..
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృ మూర్తి మంజులమ్మ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జజాల సురేందర్, హన్మంతు షిండే, షకీల్, విద్యాసాగర్ రావు, పలువురు అధికారులు, రాష్ట్ర ప్రజాప్రతినిధుల, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపీ ధర్మపురి అరవింద్, తదితర ముఖ్య నాయకులు హాజరై నివాళి అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మరోసారి ఆత్మీయతను చాటుకున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ వేముల కుటుంబంతో ఉన్న ఆత్మీయతను మరోసారి చాటుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి మృతి చెందినప్పుడు హాజరై ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మృతి చెందిన ఇప్పుడు కూడా వేల్పూరుకు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి వేముల కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు.
Spread the love