– జనసంద్రంగా మారిన మాజీ మంత్రి అంతిమయాత్ర
– నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
– డీఎస్కు అశ్రు నివాళి
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో జన హృదయ నేతగా పేరొందిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో డి.శ్రీనివాస్ కుటుంబీకులకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రగతినగర్లోని డి.శ్రీనివాస్ నివాసం నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు నిర్వహించిన అంతిమయాత్రలో అశేష జనవాహిని పాల్గొని డీఎస్కు అశ్రు నివాళులర్పించారు. దాంతో రహదారంతా జనసంద్రంగా మారింది. అంత్యక్రియల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వేల సంఖ్యలో అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.హెలికాఫ్టర్ ద్వారా నిజామాబాద్కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ నుంచి కాన్వారులో రోడ్డు మార్గం గుండా ప్రగతినగర్లోని డీఎస్ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్ బిన్ హమ్దాన్, అధికారులు, అనధికార ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు డీఎస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఐజీ సుధీర్ బాబు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని డీఎస్ భౌతిక కాయంపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. డీఎస్ కుమారులైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ డి.సంజరు తదితరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించి సంతాపం తెలియజేశారు.
డీఎస్ మరణం తీరని లోటు :సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి డీఎస్ మరణం తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం మాట్లాడారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన డీఎస్.. ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతగా కొనసాగారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకుని స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్ అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులోనూ ఆయన కీలకపాత్ర పోషించారని, ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వపరంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. డీఎస్ గౌరవం ఇనుమడించేలా, ఆయనను ప్రజలు, అభిమానులు ఎల్లవేళలా గుర్తుంచుకునేలా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డీఎస్ కుటుంబ సభ్యులను సచివాలయానికి పిలిపించుకుని, వారితో చర్చించిన మీదట డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డీఎస్ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని అన్నారు.