నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థకు తీరని మచ్చ అనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. వరుసగా జరుగుతున్న లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. మొత్తం 720 మార్కుల్లో దాదాపు 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ముందే లీక్ అయ్యాయనీ, ముఖ్యంగా కెమిస్ట్రీ విభాగంలో భారీగా అవకతవకలు జరిగాయని తెలుస్తోందని ఎత్తిచూపారు, దేశవ్యాప్తంగా విస్తరించిన కోచింగ్ మాఫియా వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యలో కార్పొరేటీకరణ ప్రవేశించిన తర్వాత ఇలాంటి ఘటనలు తరచుగా సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలోగానీ, స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్తోగానీ సమగ్ర దర్యాప్తు జరిపించాలనీ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



