నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రోహ్తక్ రోడ్డుపై సాంకేతిక కారణాలతో ఆగిపోయిన కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ చనిపోయారు. ఢిల్లీ పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్న జగ్బీర్ సింగ్ ప్రయాణిస్తున్న కారు రోహ్తక్ రోడ్డుపై మదిపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. దీంతో ఆయన కారు దిగి నిల్చున్నాడు. అదేసమయంలో వెనుకనుంచి వచ్చిన ఓ ట్రక్కు కారును ఢీకొట్టిండటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.