నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడం దారుణమని విమర్శించారు. హేతుబద్ధీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఆ పేరుతో ఒకే టీచర్ను ఇవ్వడం వల్ల అన్ని తరగతులను ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. ఖాళీలన్నీ భర్తీ చేయకుంటే ప్రగతి భవన్, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.