నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీలోని కన్నౌజ్ నుంచి బరిలో దిగిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోమవారం కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.ప్రతికకూల రాజకీయాలు చేసే వారికి లోక్సభ ఎన్నికల్లో భంగపాటు తప్పదని హెచ్చరించారు. కన్నౌజ్ ప్రజలు అభివృద్ధి, పురోగతి, సౌభాగ్యానికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని, గెలుపు కోసం ఆ పార్టీ బూటకపు హామీలిచ్చిందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కంపెనీ నుంచి బీజేపీ కోట్లాది రూపాయలు దండుకుని ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడవేసిందని అంతకుముందు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని ఇటావాలో అఖిలేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మందులు, ఇతర ఉత్పత్తులను ఎందుకు విక్రయాలకు వారు అనుమతించారని అఖిలేష్ యాదవ్ నిలదీశారు. కొవిడ్ సమయంలో వ్యాపారుల దందాకు వెసులుబాటు కల్పించిన కాషాయ పార్టీ పట్ల ప్రజల్లో పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీని మట్టుకరిపించి కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.