పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

– జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండాగే
నవతెలంగాణ –  భువనగిరి రూరల్ 
సాంప్రదాయ చేతివృత్తుల వారిని,  హస్త కళాకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి  పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే తెలిపారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హలులో మినీ సమావేశ మందిరములో పధకం అమలు కోసం ఏర్పాటు చేసిన జిల్లా  అమలు కమిటీ సమావేశంలో అయన మాట్లాడుతూ..  పథకం అమలు పట్ల  గ్రామ, పట్టణ  స్థాయిలో విస్తృతంగా  అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని  అధికారులకు సూచించారు. చేతి,  కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో సామర్థ్యం మెరుగుపరిచి  ఉత్పాదకత నాణ్యత, ఉత్పత్తులను పెంచడం ఈ పధకం ఉద్దేశ్యమని, పథకంలో చేరడం వలన  విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడి కార్డుతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకొనుటకు కావలసిన శిక్షణ, టూల్ కిట్స్, రుణ సదుపాయం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకం, మార్కెటింగ్ చేసుకొనుటకు మద్దతు లభిస్తుందని అన్నారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి,  కంసాలి,చాకలి, మంగలి, ఉప్పరి, ఎరుకల, దర్జీ,  చీపుర్లు, బుట్టల తయారీ, బార్బర్, చెప్పులు కుట్టేవారు, పనిముట్లు, తాళాల తయారీ, శిల్పి, స్వర్ణకారులు, ధోభీ,  బొమ్మల తయారీ, చేపల వల, దండలు చేసేవారు,  తాపీ పని లాంటి 18 కులవృత్తుల వారికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా కుల వృత్తులు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు  కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక  చేయూత  అందించనుందని అన్నారు. 18 సంవత్సరాలు పైబడిన కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హులని, ఎలాంటి విద్యార్హత లేకున్నా పేరు నమోదు చేసుకోవచ్చని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదని అన్నారు. విశ్వకర్మగా పేరు నమోదు కొరకు  సమీపంలోని  కామన్  సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, మొబైల్ నెంబరుతో రిజిస్టర్ చేసుకోవాలని, అట్టి దరఖాస్తులను గ్రామ పంచాయతీ స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయి అమలు కమిటీకి పంపుతుందని తెలిపారు. ఎంపికైన వారికి  రెండు రకాలుగా  శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,  ప్రాథమిక నైపుణ్యం ద్వారా 5  నుండి  7 రోజులు, అధునాతన నైపుణ్యాన్నికి  15 రోజులు  శిక్షణ అందిస్తూ శిక్షణా కాలంలో ప్రతి రోజు రూ.500 రూపాయల  భృతి ఇవ్వడంతో పాటు  శిక్షణ అనంతరం రూ.15 వేల రూపాయల  విలువైన టూల్ కిట్లు, ధ్రువీకరణ పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. రెండు విడతలుగా  లక్ష, రెండు లక్షలు కలిపి మూడు లక్షల వరకు రుణం అందజేయడం జరుగుతుందని, మొదటి విడతలో 5 శాతం వడ్డీతో  లక్ష రూపాయల ఋణం అందజేయడం జరుగుతుందని,  18 నెలల్లో చెల్లించాల్సి ఉంటుందని,  రెండో విడతలో రూ.2 లక్షలను అందజేస్తామని 36 నెలల వ్యవధిలో చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. దశల వారీగా గ్రామీణ, పట్టణ  ప్రాంతాలలో అర్హులైన అందరికి లబ్ది చేకూర్చడం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం  గ్రామ, పట్టణ స్థాయిలో  విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి వీరా రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణా రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీ లక్ష్మి, ఎం ఎస్ ఎం ఈ  సహాయ సంచాలకులు సుమతి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ బాబు, లీడ్ బ్యాంక్ అధికారి రామకృష్ణ, బిసి అభివృద్ధి అధికారి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love