టీజీఎస్ఆర్టీసీ 500 బస్సుల ప్రాజెక్టు
తుది దశ పూర్తి
రోజువారీ ప్రయాణికుల సంఖ్య 1.2 లక్షలకు
చేరే అవకాశం
గ్రీన్ మొబిలిటీకి మరో కీలక ముందడుగు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. నగరంలో సుస్థిర పట్టణ రవాణా అభివృద్ధికి కట్టుబడి ఉన్న టీజీఎస్ఆర్టీసీ 500 బస్సుల ప్రాజెక్టులో భాగంగా మరో 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు బుధవారం నగర రోడ్లపైకి రానున్నాయి. ఈవీ ట్రాన్స్ ప్రైయివేట్ లిమిటెడ్ , టీజీఎస్ఆర్టీసీ సంయుక్త భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకమైన టీజీఎస్ఆర్టీసీ 500 బస్సుల ప్రాజెక్టులో భాగంగా ఓలెక్ట్రా తయారు చేసిన 12 మీటర్ల లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను కూకట్పల్లి డిపోలో బుధవారం రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ , టీజీఎస్ఆర్టీసీ వీసీ, ఎండీ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించనున్నారు. ఈ కొత్త బస్సుల చేరికతో టీజీఎస్ఆర్టీసీ 500 బస్సుల ప్రాజెక్టు విజయవంతమైంది. ఇది హైదరాబాద్ నగరంలో పర్యావరణ అనుకూల ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.టీజీఎస్ఆర్టీసీ 500 బస్సుల ప్రాజెక్టు కింద మొత్తం 450 నాన్-ఏసీ, 50 ఏసీ లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు హైదరాబాద్ నగర ప్రజా రవాణా సేవలను బలోపేతానికి ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కింద కంటోన్మెంట్ (సీఎన్టీ), హెచ్ సీయూ , మియాపూర్, హయత్నగర్, రాణిగంజ్ డిపోల నుంచి 440 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా సేవలందిస్తున్నాయి.
ఇప్పుడు కూకట్పల్లి డిపో నుంచి చివరి దశలో 60 బస్సులు చేరడంతో మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సౌకర్యవంతమైన ప్రయాణం, విశ్వసనీయ సేవలు, పర్యావరణహిత లక్షణాల కారణంగా ప్రజలు వీటిని అధికంగా వినియోగించి ఆదరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రోజుకు సుమారు ఒక లక్ష మంది ప్రయాణికులు ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తున్నారు. కొత్తగా 60 బస్సులు చేరడంతో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 1.2 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా . ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులు సులభంగా ఎక్కేందుకు, దిగేందుకు అనువైన లో-ఫ్లోర్ డిజైన్, విశాలమైన, సౌకర్యవంతమైన సీటింగ్, పూర్తిగా పర్యావరణహిత జీరో ఎమిషన్ టెక్నాలజీ, శబ్ద కాలుష్యాన్ని తగ్గించే ఆధునిక వ్యవస్థ, అత్యాధునిక భద్రతా సదుపాయాలు , నగర ప్రయాణాలకు అనువైన సాఫ్ట్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కలిగి ఉన్నాయి. టీజీఎస్ఆర్టీసీ , ఈవీ ట్రాన్స్ సంస్థలు సంయుక్తంగా అమలు చేసిన ఈ 500 బస్సుల ప్రాజెక్టు, హైదరాబాద్ నగరంలో గ్రీన్ మొబిలిటీ ప్రోత్సాహానికి, ప్రపంచ స్థాయి ప్రజా రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నగర కాలుష్యం తగ్గడం, ప్రజా రవాణా సేవల ప్రాప్తి పెరగడం, అలాగే పెద్ద స్థాయిలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వినియోగం పెరగడం వంటి ప్రయోజనాలు నగరానికి లభించనున్నాయి.



