నవతెలంగాణ – ఇంఫాల్: తెగల మధ్య వైరం కారణంగా గత వందరోజులుగా హింసాత్మకంగా మారిన మణిపుర్)లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఇంఫాల్ జిల్లా కేంద్రానికి 47 కి.మీ దూరంలో కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ అనే గ్రామంపైకి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో కొండపై నుంచి సాయుధ మూకలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన వారి కోసం రాష్ట్ర పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. మణిపుర్లో శాంతి నెలకొల్పేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కుకీ-జో తెగల నివాసిత ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని ప్రకటించాలని గిరిజన మహిళల వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.