ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ చెల్లింపు

– స్వాగతించిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఈయూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన 5 శాతం డీఏను సెప్టెంబర్‌ మాసం జీతంతో ఇస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. దీనితో ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 8 డిఏలు ఇచ్చినట్టు అయ్యిందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారనీ, పెండింగ్‌ బకాయిలు త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.
సంతోషం…కానీ…
జనవరి డిఏ చెల్లింపును స్వాగతిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జులై డిఏతోపాటు 168 నెలల డిఏ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని కోరారు. బకాయిలు చెల్లిస్తే ఒక్కో కార్మికుని కుటుంబానికి సగటున 1.60 లక్షలు వస్తుందనీ, అవి పిల్లల చదువులకు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేశారు.

Spread the love