నవతెలంగాణ-హత్నూర
పరిశ్రమలో విధి నిర్వహణలో ఉన్న ఓ కార్మికుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ శివారులోని అపిటోరియా యూనిట్-9 పరిశ్రమలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన కిరణ్(37) కొంతకాలంగా అపిటోరియా యూనిట్-9 పరిశ్రమలో కెమిస్ట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం మొదటి షిఫ్ట్ విధులకు హాజరై పని చేస్తుండగా.. ఉన్నట్టుండి స్పృహ తప్పి ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన తోటి కార్మికులు అతడిని వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ సుభాష్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.