మరణించిన జర్నలిస్టుల ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు.. : అల్లం నారాయణ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి సంబం ధిత జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా ధృవీకరించి పంపాలని సూచించారు. దరఖా స్తుతోపాటు జర్నలిస్టు మరణ ధృవీకరణ, ఆదాయ, కుటుంబ ధృవీకరణ పత్రాలతో పాటు జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలు ఉండాలని పేర్కొ న్నారు. ప్రమాదం బారిన పడిన జర్నలిస్టు లేదా అనారోగ్య కారణాలతో పని చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు కూడా ఆర్థిక సహాయార్థం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తుతోపాటు ప్రభుత్వ సివిల్‌ సర్జన్‌ డాక్టరు ఇచ్చిన ”జర్నలిస్టు పని చేసే స్థితిలో లేడు (INCAPACITATION)” అనే సర్టిఫికేట్‌ తో పాటు ఆదాయ, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలతో జిల్లా పౌర సంబంధాల అధికారి ధృవీకరణతో పంపాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే మీడియా అకాడమీ నుండి లబ్ది పొందిన వారు, పెన్షన్‌ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని తెలిపారు. తమ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీలోపు కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి.నెం.10-2-1, యఫ్‌.డ్‌.సి.కాంప్లెక్సు, 2వ అంతస్థు, సమాచార భవన్‌, మాసబ్‌ టాంక్‌, హైదరాబాదు – 500028 లో అందజేయాలని సూచించారు. అందిన దరఖాస్తులను జర్నలిస్టు సంక్షేమ నిధి కమిటీ పరిశీలించి ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ఇతర వివరాలకు కార్యాలయ అధికారి మొబైల్‌ నెంబర్‌ 7702526489 ను సంప్రదించాలని సూచించారు.

Spread the love