– టౌన్ ప్లానింగ్, డబుల్ బెడ్ రూం విన్నపాలే అధికం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్, డబుల్ బెడ్ రూం, ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజల నుంచి ధరఖాస్తులు అధికంగా వచ్చాయి. ప్రజావాణిలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఈ ప్రజావాణిలో అడిషనల్ కమిషనర్లు కే.శ్రీనివాస్, సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి, నళిని పద్మావతి, చంద్ర కాంత్ రెడ్డి, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్ ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, డబుల్ బెడ్ రూం, ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించిన ఎక్కువగా వచ్చాయి. మొత్తం 137 భౌతికంగా విన్నపాలు రాగా 15 విన్నపాలు ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా స్వీకరించారు. భౌతికంగా మొత్తం 137 లలో హౌసింగ్ 53 విన్నపాలు వచ్చాయి. అదే విధంగా టౌన్ ప్లానింగ్ 42, ఇంజనీరింగ్ 15, అడ్మిన్ 6, ఎస్టేట్ 5, ఎలక్ట్రికల్ 2, ట్యాక్స్ 8, ఎంటమాలజీ 1, ట్రేడ్ లైసెన్స్ 1 విన్నపాలు వచ్చాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లలో 105 విన్నపాలు రాగా చార్మినార్ జోన్లో 9, సికింద్రాబాద్ జోన్లో 12, కూకట్ పల్లి జోన్ లో 49, శేరిలింగంపల్లి జోన్ 21, ఖైరతాబాద్ జోన్ 4, ఎల్బీనగర్ జోన్లో 10 విన్నపాలు వచ్చాయి. టౌన్ ప్లానింగ్కు సంబంధించిన విన్నపాలు ఎక్కువగా వచ్చాయి. టెలిఫోన్ ద్వారా 15 విన్నపాలు రాగా అందులో టౌన్ ప్లానింగ్, రేషన్ కార్డు, జీహెచ్ఎంసీకి సంబంధించినవి కాకుండా ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇతర శాఖలకు చెందిన సమస్యలను ఆయా శాఖలకు పంపించారు. టెలిఫోన్ ద్వారా వచ్చిన సమస్య అతని పేరు మొబైల్ నెంబర్ సమస్య గురించి తెలుసుకొని అడిషనల్ కమిషనర్ సేకరించి సంబంధిత విభాగం ఉన్నతాధికారులకు పరిష్కారం కోసం పంపించారు. ఈ ప్రజావాణిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, చీఫ్ ఎంటమాలజీ డా.రాంబాబు, హౌసింగ్ ఎస్ఈ విద్యాసాగర్, డిప్యూటీ సిఈ కె.ఎస్.రెడ్డి, కంట్రోల్ రూం ఓ ఎస్ డి అనురాధ తదితరులు పాల్గొన్నారు.