న్యాయవ్యవస్థ సమగ్రతపై దాడి

– రాజకీయంగా దెబ్బతీసే కుటిల యత్నాలు సీజేఐకి 600 మందికి పైగా పముఖ న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ, అది ఎదుర్కొంటున్న సమస్యల గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌కు దేశంలోని పలువురు ప్రముఖ న్యాయవాదులు లేఖను రాశారు. ఈ లేఖ రాసిన 600 మందికి పైగా న్యాయవాదులలో.. ప్రముఖ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, పింకీ ఆనంద్‌ వంటి వారున్నారు. అందులో వారు తమ అభిప్రాయాలను, ఆందోళనలను వ్యక్తం చేశారు. దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ న్యాయవాదుల లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ”పొలిటికల్‌ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూపులు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించడం, రాత్రి మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేయటం వంటి అంశాలు బాధాకరం” అని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ”రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయటం.. ఆ తర్వాత వారినే కోర్టుల్లో సమర్థించటం ఆశ్చర్యంగా ఉన్నది. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం ఇచ్చినట్టే అవుతుంది. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం” అని న్యాయవాదులు తమ లేఖలో వివరించారు.

Spread the love