2.915 కిలోల బంగారం పట్టివేత దాని విలువ సుమారు రూ.1.81 కోట్లు
నవతెలంగాణ-శంషాబాద్
విదేశాల నుంచి భారీఎత్తున బంగారం తరలిస్తుండగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం పట్టుబడింది. కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన వ్యక్తి దుబారు నుంచి తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేశారు. ఆ బ్యాగులో ఎమర్జెన్సీ లైటు కనిపించింది. దానిని పరిశీలించగా బంగారం బయటపడింది. ఎమర్జెన్సీ లైట్లోని బ్యాటరీ స్థలంలో బంగారాన్ని ఉంచి తీసుకొచ్చినట్టు గుర్తించారు. బంగారం విలువ రూ.1,81,60,450/- ఉంటుంది. 2.915 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.