మణిపూర్‌లో బీజేపీ అండతోనే గిరిజనులపై దాడులు : టీఏజీఎస్‌

నవతెలంగాణ- ఆదిలాబాద్‌
మణిపూర్‌లో ఆదివాసీ కుకీ, నాగ గిరిజన తెగలపై బీజేపీ అండతో జరుగుతున్న దాడులను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. గిరిజనులపై దాడులు ఆపడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, మతోన్మాదులను కఠినం శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మణిపూర్‌ రాష్ట్రంలో రెండు మాసాలుగా కుకీ, నాగ ఆదివాసీ గిరిజన తెగలపై మతోన్మాద శక్తుల దాడులతో అట్టుడుకుతోందన్నారు. కేంద్రంలో, మణిపూర్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గిరిజనులపై దాడులను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న మైతీ కులస్తులలో తమ బలాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే మణిపూర్‌లో కుకీ, నాగ ఆదివాసీ గిరిజన తెగలపై దాడులని పేర్కొన్నారు. బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర జనాభాలో 54శాతం ఉన్న మైతీ కులస్తులను గిరిజన తెగల జాబితాలో చేర్చడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. తద్వారా రాష్ట్ర జనాభాలో మైనారిటీగా ఉన్న కుకీ, నాగ గిరిజన తెగల హక్కులను దెబ్బతీయాలని చూస్తోందని పేర్కొన్నారు. కుకీ, నాగ తెగలను అడవి నుంచి గెంటేయాలని, వారి ఆధీనంలో ఉన్న భూములను గిరిజనేతరులైన మైతీలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. అందుకు ఆటంకంగా ఉన్న గిరిజన చట్టాలను అతిక్రమించడానికి మైతీలను గిరిజనులుగా మార్చే ప్రయత్నాలకు బీజేపీ తెరతీసిందని పేర్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన కుకీ, నాగ గిరిజన తెగలపై బీజేపీ అండతో మతోన్మాద శక్తులు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. గిరిజనుల ఇండ్లను, ఆస్తులను, చర్చీలను ధ్వంసం చేశారని, 70మందికి పైగా చనిపోయారని పేర్కొన్నారు. శాంతియుతంగా కలిసి మెలిసి జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెట్టి మణిపూర్‌ రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చిందని తెలిపారు. మణిపూర్‌ ఆదివాసీ గిరిజనులపై జరుగుతున్న జాతి ఉన్మాద, మతోన్మాద దాడులను ప్రజలంతా తీవ్రంగా ఖండించాలని, కుకీ, నాగ ఆదివాసీ గిరిజన తెగలపై మతోన్మాద శక్తుల దాడులను అరికట్టేందుకే తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love