Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ లో ప్రభుత్వ పాఠశాలపై అవగాహన

కోనాపూర్ లో ప్రభుత్వ పాఠశాలపై అవగాహన

- Advertisement -

– విద్యార్థులను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని వినతి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ ప్రభుత్వ పాఠశాల పట్ల అవగాహన కల్పించారు. కోనాపూర్ గ్రామంలో 1-10 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమంలో తరగతులు నిర్వహిస్తున్నామని, గత 15 సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్థులు 100 శాతం  ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. లర్నింగ్ ఇంప్రూమెంట్  ప్రోగ్రాం ఫౌండేషన్, లర్నింగ్ అండ్ న్యూమరసి ద్వారా బోధన జరుగుతుందని, గ్రంథాలయంలో తెలుగు హిందీ ఆంగ్లం భాషలలో వెయ్యి పుస్తకాలు ఉన్నాయని సభ్యులకు వివరించారు. ప్రతి నెల తల్లిదండ్రులకు సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

స్వచ్ఛ హరిత విద్యాలయ ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని, కృత్రిమ మేధ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఉంటుందని, సైన్స్ గణిత లాబరేటరీ ద్వారా విద్యార్థులే ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకుంటారని తెలిపారు. ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్, 21 వస్తువులతో కిట్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, అభ్యాస దీపికలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాగి జావా, మినరల్ వాటర్, ప్రతి సంవత్సరం విద్యార్థులకు రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

పదవ తరగతి విద్యార్థులకు విషయానికులచే ప్రత్యేక సెమినార్ లు నిర్వహిస్తారని, బాలికలకు రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ పథకం ద్వారా కరాటే శిక్షణ, పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సదస్సులు, సైబర్ క్రైమ్ లపై అవగాహన, బ్యాంక్ అధికారులచే ఆర్థిక అక్షరాస్యత తరగతులు నిర్వహణ ఉంటుందన్నారు.విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించేందుకు నాలుగు క్లబ్లుగా విభజించి అంతర్గత పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. సమీపంలో గల రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలలో విద్యార్థులను చేర్పిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యార్థులు నాన్ లోకల్ గా పరిగణించబడతారని, దాంతో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధర్మేందర్, భాస్కర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -