బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు దుష్ప్రచారం

– కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటన
– కీలకమైన ఓ నాయకుడే నా స్థానాన్ని దిగజారుస్తున్నారు
– ఏ ప్రభుత్వంతోనూ, నాకు వ్యాపారం, భూ ఒప్పందాలు లేవు
– ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ రక్షణ కోసం పోరాడాను
– నిరాధారమైన, తప్పుడు కథనాలు బాధ కలిగిస్తున్నాయి : ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘నేను కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఎలాంటి ఆధారాల్లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో నా స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో నా ప్రతిష్టను తగ్గించేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదష్టకరం. సోషల్‌ మీడియా, మీడియాలో వస్తున్న ఈ పుకార్లను నేను ఖండిస్తున్నాను. అవి పూర్తిగా అవాస్తవం’ అని ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఈమేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా, 30 ఏండ్లు నిరంతరంగా కాంగ్రెస్‌ పార్టీకి విధేయతతో పని చేసి, వరుసగా ఆరు ఎన్నికల్లో గెలుపొందినందుకు నేను గర్విస్తున్నాను. నా భార్య పద్మావతి రెడ్డి గతంలో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం వంద ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోదాడలో ఉంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున తన శక్తిమేరకు అక్కడి ప్రజల కోసం పనిచేస్తున్నారు. మాకు పిల్లలు లేరు. మేము ప్రజల్నే మా కుటుంబంగా మా పిల్లలుగా భావిస్తూ నిబద్ధతతో కూడిన ప్రజా జీవితంలో నిరంతరం పని చేస్తున్నాం’ అని వారు పేర్కొన్నారు. గత రెండేడ్లుగా తమపై పూర్తిగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి చాలా బాధాకరమైనవి తెలిపారు. పార్టీలో మా అనుచరులను అణగదొక్కడం, తొలగించడమే లక్ష్యంగా కూడా ఈ ప్రచారం జరుగుతున్నదని పేర్కొన్నారు. పార్టీలో కొన్ని సమస్యలు, పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు, కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధి విధానాలను అనుసరిస్తానని ఉత్తమ్‌, పద్మావతి అభిప్రాయపడ్డారు. వాటిపై బయట మాట్లాడబోనని స్పష్టం చేశారు.
అధికారిక కార్యక్రమాల్లో తప్ప ఇప్పటివరకు కేసీఆర్‌ను కలవలేదు
ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోనూ, రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై పి. చిదంబరం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ను ఏనాడూ కలవలేదని ఉత్తమ్‌ వెల్లడించారు. తనకు ఎవరితోనూ ఎలాంటి వ్యాపార, కాంట్రాక్టులు, భూమి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్‌గా పనిచేసిన తర్వాత, రాష్ట్రపతి భవన్‌ లో రాష్ట్రపతి వెంకట్రామన్‌, శంకర్‌దయాళ్‌ శర్మ వద్ద సీనియర్‌ అధికారిగా పనిచేశానని పేర్కొన్నారు. ఆవిధంగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజా జీవితంలో ఉండేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీ నామా చేసినట్టు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా దేశంలో ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద గృహ నిర్మాణ కార్య క్రమాన్ని పర్యవేక్షించినట్టు గుర్తు చేశారు. తమ జీవితంలో మా సంపద, మా ఆరోగ్యం, మా కుటుంబ జీవితం, ఇలా జీవితంలోని ప్రతి దాన్ని కాంగ్రెస్‌ పార్టీ సేవలోనూ, సాధారణ ప్రజల కోసం అందించినట్టు పేర్కొ న్నారు. ఒక నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూ ట్యూబ్‌ ఛానెల్‌లు, మీడియా సంస్థలు తన గురించి, తన సతీమణి గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం తీవ్ర బాధను,వేదనను కలిగించాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతు న్నారనే నిరాధారమైన, తప్పుడు కథనాలను ఆయన ఖండించారు.

Spread the love