Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్‌

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్‌

- Advertisement -

షరతులతో మంజూరు చేసిన హైకోర్టు
హైదరాబాద్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌కు ఊరట లభించింది. పోక్సో కేసులో అతడికి తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. దర్యాప్తునకు సహకరించాలని బండి భగీరథ్‌ను ఆదేశించింది. హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో అతడిపై పోక్సో కేసు నమోదైంది. మే 16న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ భగీరథ్‌ విద్యార్థి అని, 45 రోజులకుపైగా జైలులో ఉండటంతో జీవితంలో చాలా కోల్పోయాడన్నారు. పరస్పర అంగీకారంతో జరిగిన దానిపై కేసులు నమోదు చేయడం చెల్లదని.. ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు పలు తీర్పుల్లో వెల్లడించాయన్నారు. బెయిల్‌ మంజూరు చేస్తే కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటారన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. మే 8న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వెంటనే వాంగ్మూలాల సేకరణ మొదలైందన్నారు. దర్యాప్తు దాదాపు పూర్తికావచ్చిందని, గడువులోగా అభియోగ పత్రాన్ని దాఖలు చేస్తామన్నారు. ఈ దశలో బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుజన తీర్పును నేటికి వాయిదా వేశారు. తాజాగా భగీరథ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -