కల్తాన్ దాస్ గుప్తాపై కమలం పార్టీ దుండగుల దాడి
సీపీఐ(ఎం) కార్యకర్త, ఆయన కుమార్తెకు గాయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పశ్చిమబెంగాల్లో బీజేపీ దుండగులు రెచ్చిపోయారు. శాంతియుతంగా ప్రచారం నిర్వహిస్తున్న సీపీఐం(ఎం) అభ్యర్థిపై దాడికి దిగారు. ఈ ఘటనలో సీపీఐ(ఎం) కార్యకర్త, ఆయన కుమార్తెకు గాయాలయ్యాయి. వివరాళ్లోకెళ్తే.. పానిహటి అసెంబ్లీ నియోజకవర్గంలో అగర్పారా 8, 9 వార్డులలో ప్రచారం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి కల్తాన్ దాస్గుప్తాపై బీజేపీ దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో సీపీఐ(ఎం) కార్యకర్త సుర్జిత్ ముఖర్జీ, ఆ ప్రాంత విద్యార్థిని అయిన ఆయన కుమార్తె శ్రీలేఖకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరూ పానిహటి సీపీఐ(ఎం) అభ్యర్థి కల్తాన్ దాస్గుప్తా కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనను పానిహటి సీపీఐ(ఎం) అభ్యర్థి కల్తాన్ దాస్గుప్తా నిరసించారు. వెంటనే ఒక నిరసన సభను నిర్వహించారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారం ముగిసింది. మధ్యాహ్నం, ప్రచారం ముగియడానికి ముందు క్యాంపెయిన్ చేస్తున్న లెఫ్ట్ ఫ్రంట్పై బీజేపీ మద్దతున్న దుండగులు దాడి చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో బీజేపీ రోడ్ షో జరుగుతోంది. ప్రచారం ఆపి అక్కడి నుంచి వెళ్లిపోవాలని బీజేపీ కార్యకర్తలు సీపీఐ(ఎం) నేతలను బెదిరించారు. ఆ తర్వాత ఈ దాడికి దిగారు. శ్రీలేఖ మాట్లాడుతూ… ”బయట నుంచి బీజేపీ కార్యకర్తలు అకస్మాత్తుగా వచ్చి దాడి చేశారు.
మైక్రోఫోన్ వైరు తెంపేశారు. మా నాన్నగారినీ, నన్ను కొట్టారు. ఆ పరిస్థితిలో అక్కడున్న పోలీసు సిబ్బంది కూడా ముందుకు రాలేదు. వాళ్లు సహాయం కూడా చేయలేదు” అని వివరించారు.ఈ దాడిని కల్తాన్ దాస్గుప్తా తీవ్రంగా నిరసించారు. ఆయన మాట్లాడుతూ ”బీజేపీ నిజానికి అత్యంత స్త్రీ ద్వేషపూరిత పార్టీ, ఈ రోజు జరిగిన సంఘటనతో ఇది మరోసారి రుజువైంది. ప్రధానమంత్రి పానిహటిలో సమావేశం నిర్వహించడానికి వచ్చినప్పుడు కూడా, ఆయన న్యాయం గురించి ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ కూడా బీజేపీ నాయకులు మహిళలపై నీచమైన దాడులు చేశారు” అని అన్నారు. ఉన్నావ్, హత్రాస్ ఘటనలు, పార్క్ స్ట్రీట్ నుంచి ఆర్జీ కార్ ఘటన వరకు… బీజేపీ, టీఎంసీ చేతుల్లో మహిళల గౌరవానికి భద్రత లేదని మేము పదేపదే చెబుతూనే ఉన్నామని తెలిపారు. ”ఇదే బీజేపీ అసలు స్వరూపం. ఈ స్వరూపాన్ని అర్థం చేసుకుని, బెంగాల్ గడ్డ నుంచి బీజేపీని తరిమికొట్టడానికి మేము కృషి చేస్తాము. మహిళల గౌరవాన్ని కాపాడే పనిని వామపక్షాలు చేస్తాయి” అని ఆయన వివరించారు. బీజేపీ, టీఎంసీల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
సీపీఐ(ఎం) అభ్యర్థిపై బీజేపీ దౌర్జన్యం
- Advertisement -
- Advertisement -



