Wednesday, September 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!

బ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!

- Advertisement -

బ్రిక్స్‌ 18వ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబరు 12–13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది. భారత్‌ 2012లో తొలిసారిగా బ్రిక్స్‌ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వగా, అనంతరం మరో మూడుసార్లు నిర్వహించింది. మన్మోహన్‌సింగ్‌ ఒకసారి, నరేంద్ర మోడీ మూడు సార్లు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఒక సభ్యదేశం అధ్యక్ష బాధ్యతలు చేపడుతుంది. వచ్చే ఏడాది చైనాకు ఈ బాధ్యతను ఢిల్లీ సమావేశం అప్పగించింది.“స్థిరత్వం, నవకల్పన, సహకారం, సుస్థిరత” అనే ఇతివృత్తంతో ఢిల్లీ ప్రకటనను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రాంతీయంగా తీవ్రమైన ఉద్రిక్త తలు కొనసాగుతున్న పరిస్థితుల్లో పదకొండు సభ్యదేశాల మధ్య ఐక్యత సాధించడాన్ని కొందరు భారత్‌ దౌత్యపరమైన పురోగతిగా అభివర్ణించారు. అయితే గత బ్రిక్స్‌ సమావేశాలను పరిశీలిస్తే ఏకాభిప్రాయ సాధన కోసం రాజీపడటం, వివాదాస్పద అంశాలపై తీవ్ర పదజాలానికి దూరంగా ఉండటం సాధారణమేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించి, ప్రపంచ పాలనా వ్యవస్థలను సంస్కరించాలని బ్రిక్స్‌ కోరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాసలో తగిన ప్రాతినిధ్యం లేదని, వారి జనాభా, ఆర్థిక ప్రాధాన్యతకు అనుగుణంగా నిర్ణయాత్మక పాత్ర కల్పించాలని డిమాండ్‌ చేసింది.

ఇది భారత్‌, బ్రెజిల్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి పరోక్ష మద్దతుగా కొందరు విశ్లేషించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వర్ధమాన దేశాల వాటా పెరుగుతున్నందున ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ కోటా విధానాన్ని కూడా సమీక్షించాలని సమావేశం కోరింది. డాలరుకు ప్రత్యామ్నాయంగా వెంటనే ఒక ఉమ్మడి బ్రిక్స్‌ కరెన్సీని ప్రవేశపెట్టే నిర్ణయం మాత్రం తీసుకోలేదు. బదులుగా సభ్యదేశాల మధ్య స్థానిక కరెన్సీలలో వాణిజ్య లావా దేవీలను పెంచుకోవాలని, స్థిరమైన సరఫరా వ్యవస్థలను నిర్మించు కోవాలని నిర్ణయించింది. పశ్చిమ దేశాలు ఏకపక్షంగా విధిస్తున్న పన్ను నిర్ణయాలను పేరు ప్రస్తావించకుండా విమర్శించింది. సాంకేతిక పరిజ్ఞానం, సహజ వనరులను ఆయుధాలుగా మార్చడాన్ని వ్యతిరేకించింది. గాజాలో జరిగిన మారణకాండను బ్రిక్స్‌ తీవ్రంగా ఖండించింది. అయితే ఇజ్రాయిల్‌, అమెరికా పేర్లను ఢిల్లీ ప్రకటనలో నేరుగా ప్రస్తావించలేదు. ఇరాన్‌పై జరిగిన దాడులను కూడా వ్యతిరేకిస్తూ దేశాలు సంయమనం పాటించాలని కోరింది. పాలస్తీనాకు పూర్తిస్థాయి ఐరాస సభ్యత్వం కల్పించాలని, 1967 నాటి సరిహద్దుల ఆధారంగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుతో పాటు తూర్పు జెరూసలేంను రాజధానిగా చేయాలని కోరింది. పహల్గామ్‌ దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాద దాడులను ఖండించింది.

అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల స్వేచ్ఛాయుత రవాణా, నావికుల భద్రతకు హామీ ఇవ్వాలని తీర్మానించింది. బ్రిక్స్‌లో ఏకాభిప్రాయమే ప్రధాన సూత్రం కావడంతో అనేక అంశాలపై రాజీ తప్పదు. అందువల్ల ఉమ్మడి కరెన్సీ విషయంలో కూడా నిర్దిష్ట చర్య తీసుకోలేదు. డాలరుకు ప్రత్యామ్నాయంపై చర్చ కొనసాగుతున్న ప్పటికీ తక్షణమే బ్రిక్స్‌ కరెన్సీ అమల్లోకి వచ్చే పరిస్థితి లేదు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. డాలరును పక్కనపెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీతో వాణిజ్యం చేస్తే బ్రిక్స్‌ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ ఉన్నాయి. మరో 34 దేశాలు చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు పేర్కొనబడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలరు ఆధిపత్యం రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బలపడింది. బ్రెట్టన్‌ వుడ్స్‌ వ్యవస్థలో ఒక ఔన్సు బంగారాన్ని 35 డాలర్లకు సమానంగా నిర్ణయించారు. 1971లో డాలరు-బంగారం సంబంధాన్ని అమెరికా తెంచిన తరువాత డాలరు మరింత స్వేచ్ఛగా అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీగా కొనసాగింది. యూరో ప్రవేశించినప్పటికీ డాలరుకు పూర్తి ప్రత్యామ్నాయంగా మారలేదు.

అయితే గత పాతికేళ్లలో డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2024 డిసెంబరు 2న ఔన్సు బంగారం ధర 2,626 డాలర్లు ఉండగా, 2026 సెప్టెంబరు 15న అది 4,300 డాలర్లు దాటింది. డాలరును అమెరికా తన విదేశాంగ, ఆర్థిక విధానాల్లో ఆయుధంగా ఉపయోగి స్తోందనే ఆందోళన అనేక దేశాల్లో ఉంది. ఇరాన్‌, రష్యాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో వాటితో వాణిజ్యం చేయడానికి ప్రత్యామ్నాయ కరెన్సీల అవసరం ఏర్పడింది. స్విఫ్ట్‌ అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థ నుంచి రష్యా, ఇరాన్‌లను తొలగించడం కూడా ఇతర దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించే పరిస్థితిని కల్పించింది. డాలరును పూర్తిగా తిరస్కరించాలన్నది తమ లక్ష్యం కాదని, డాలరు లావాదేవీలపై పరిమితులు ఉన్నందున ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. భారత్‌ మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ డాలరును దెబ్బతీయడం తమ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. కొన్ని వాణిజ్య భాగస్వాముల వద్ద డాలర్లు అందుబాటులో లేకపోవడం వల్ల స్థానిక కరెన్సీలలో లావాదేవీలు చేస్తున్నామని చెప్పారు.

రూపాయిలో వాణిజ్యం జరిగితే మారకపు విలువల హెచ్చుతగ్గుల ముప్పు తగ్గుతుంది. భారత్‌ ఇప్పటికే 24 దేశాలతో రూపాయి ఆధారిత లావాదేవీలకు అవగాహన ఏర్పరచుకున్నట్లు పేర్కొనబడింది. అయితే అమెరికాతో భారత్‌కు ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు, ముఖ్యంగా ఐటీ, సేవలు, ఔషధ, వస్త్ర రంగాల పశ్చిమ మార్కెట్లపై ఆధారపడటం వల్ల డాలరుతో పూర్తిగా తెగతెంపులు చేసుకునే పరిస్థితి లేదు. చైనాతో వాణిజ్య లోటు ఉండగా అమెరికాతో మిగులు ఉండటం కూడా భారత్‌ వైఖరిని ప్రభావితం చేస్తోంది. బ్రిక్స్‌ జీడీపీలో చైనా వాటా సుమారు 70 శాతంగా ఉండటం మరో ముఖ్యఅంశం. ప్రత్యామ్నాయ కరెన్సీ ఏర్పడితే దానిపై చైనా ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందనే ఆందోళన భారత్‌లో ఉంది. అందువల్ల భారత్‌ ఉమ్మడి కరెన్సీ పథకాలకు దూరంగా ఉంటూ, అవసరమైన చోట స్థానిక కరెన్సీ లావాదేవీలను మాత్రమే ప్రోత్సహి స్తోంది. ప్రపంచ జీడీపీలో అమెరికా వాటా 1960 దశకంలో సుమారు 40 శాతం ఉండగా 2026లో 25.64 శాతానికి తగ్గింది. చైనా వాటా 2000లో 3.6 శాతం నుంచి 16.5 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో భారత్‌ వాటా 1.4 నుంచి 3.29 శాతానికి పెరిగింది.

ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్‌ దేశాల వాటా కూడా క్రమంగా పెరుగుతోంది. విదేశీ మారక నిల్వల్లో డాలరు వాటా తగ్గుతున్న సమయంలో అనేక దేశాలు ఇతర కరెన్సీలతో పాటు బంగారం నిల్వలను పెంచు తున్నాయి. ప్రపంచ రిజర్వు బ్యాంకులు 2010లో 79.15 టన్నుల బంగారం కొనుగోలు చేయగా, 2015లో 579.6 టన్నులు, 2023లో 1,037.1 టన్నులు కొనుగోలు చేశాయి. ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వ 880.52 టన్నులకు, చైనా వద్ద 2,313 టన్నులకు చేరింది. అమెరికా వద్ద 8,133 టన్నులు, జర్మనీ వద్ద 3,350, ఫ్రాన్స్‌ వద్ద 2,437, ఇటలీ వద్ద 2,452, జపాన్‌ వద్ద 846 టన్నుల బంగారం ఉన్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. బ్రిక్స్‌పై ట్రంప్‌ ఒత్తిడి ఉన్నప్పటికీ దాని ప్రధాన లక్ష్యం చైనా మార్కెట్‌, ఆర్థిక శక్తిని ఎదుర్కోవడమేనని ఈ పరిణా మాలను పరిశీలించినప్పుడు స్పష్టమవుతుంది. అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు చైనా గత కొన్నేళ్లుగా ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేస్తోంది. అమెరికా తీసుకున్న చైనా రుణం సుమారు 734 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2017 నుంచి చైనా దానిని క్రమంగా తగ్గిస్తోంది. చైనా తన వద్ద ఉన్న అమెరికా బాండ్లను పెద్ద మొత్తంలో విక్రయిస్తే ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే చైనాకూ నష్టం కలిగే ప్రమాదం ఉండటంతో అది జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

అమెరికాను ఎదుర్కొనేందుకు చైనా వద్ద మరో సాధనంగా యువాన్‌ విలువను తగ్గించడం, సెమీకండక్టర్లు, విద్యుత్‌ బ్యాటరీలకు అవసరమైన అరుదైన ఖనిజాల ఎగుమతులను నియంత్రించడం, అమెరికా కంపెనీల ఉత్పత్తులపై ఆంక్షలు విధించడం వంటి అవకాశాలను పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. అయితే వీటిని చైనా వాస్తవంగా ఎంతవరకు ఉపయోగిస్తుందో చెప్పలేం. మొత్తంగా ఢిల్లీ బ్రిక్స్‌ సమావేశం అమెరికా, పశ్చిమ దేశాలకు డాలరు ఆధిపత్యం, ఏకపక్ష ఆంక్షలు, ప్రపంచ పాలనా వ్యవస్థల సంస్కరణ వంటి అంశాల్లో పరోక్ష హెచ్చరికలు చేసింది. అయితే ఉమ్మడి కరెన్సీ విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోకుండా స్థానిక కరెన్సీల వాణిజ్యానికే ప్రాధాన్యత ఇచ్చింది. బ్రిక్స్‌ విస్తరణ, స్థానిక కరెన్సీల వినియోగం, బంగారం నిల్వల పెంపు, డాలరు వాటా తగ్గడం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులను సూచిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా మార్కెట్‌, డాలరు వ్యవస్థపై అనేక దేశాలకు ఉన్న ఆధారపడటం వల్ల ఈ మార్పు ఒక్కసారిగా జరగదు. బ్రిక్స్‌ పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యతలో చైనా కేంద్రస్థానంలో ఉండటంతో, అమెరికా ఒత్తిడిలో ప్రధాన కేంద్రీకరణ చైనాపైనే కొనసాగుతుందనే అంశం ఢిల్లీ సమావేశం నేపథ్యంలో స్పష్టమవుతోంది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -