ఉచిత బస్సు పథకాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది: సీతక్క

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్ విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత మంత్రి మీడియాతో పలు విషయాలపై మాట్లాడారు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసుకోవాలని, లేకపోతే ప్రజలు వారిని ఎప్పటికీ తిరస్కరిస్తూనే ఉంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అహంకారమే కారణమని అన్నారు. సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లులకు సంబంధించి రూ.1200 కోట్లను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. సమయానికి సర్పంచుల బిల్లులు చెల్లించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటివరకూ ప్రమాణ స్వీకారం చేయడం లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, కేటీఆర్‌కు కుళ్లు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులకు ప్రతినెల 5 లోపు జీతాలు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే నిధులు వెచ్చిస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు.

Spread the love