వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసంపై ప్రచారం
పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలనపై సెప్టెంబర్ 2నుంచి వారం రోజుల పాటు బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాటను విజయవంతం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 2న ఆరు గ్యారెంటీల వైఫల్యంపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, 3న వ్యవసాయ విధ్వంసంపై అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు, నిరసనలు, 4న మహిళలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై ఆందోళనా కార్యక్రమాలు, 5న ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్పై పోరాటం, 6న హైదరాబాద్లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ, 7న, ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతిపత్రాలు 8న వారం రోజుల పోరాట కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని పార్టీ శ్రేణులను కోరారు. అలాగే సెప్టెంబర్ 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ తరపున సంఘీభావం తెలియజేయాలన్నారు. మొత్తం కార్యక్రమాలను పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. ప్రతి కార్యక్రమంపై నివేదికలు తీసుకోవడంతోపాటు పార్టీ కేడర్ను అప్రమత్తం చేసి నాయకులకు అవసరమైన మార్గదర్శకాలు అందజేస్తామని చెప్పారు. పార్టీ నిర్దేశించిన కార్యాచరణను ప్రతి ఒక్కరూ తమ తమ కార్యక్షేత్రాల్లో విజయవంతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 2 నుంచి బీఆర్ఎస్ పోరుబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



