రాష్ట్రంలో మళ్లీ గెలిచేది బీఆర్‌ఎస్‌దే

– రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి
– బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్‌
రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్సే గెలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అండగా నిలవాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు. ఆసరా పించన్లు, కళ్యాణ లక్ష్మీ షాదీముబారక్‌, రైతు బీమా రైతు బంధు, దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు పథకాలతో కేసీఆర్‌ పేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారాడని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గం మరింత అభివద్ధి కావాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌ యాదవ్‌ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు యువతీ యువకులు డప్పుల దర్వులతో బతుకమ్మలు ఆడుతూ ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు గోలి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ గోరటి శ్రీనివాస్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ నాగులు నాయక్‌, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love