– కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీ సింగ్, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
– కడ్తాల్ సమీపంలో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీల సమావేశం
నవతెలంగాణ-ఆమనగల్
సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పర్చాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రం సమీపంలో ఉన్న ఎస్ఎల్ఆర్ గార్డెన్లో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి బూత్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ఆదిశగా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని వారు చెప్పుకొచ్చారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నామినేషన్ దాఖలు చేసిన కసిరెడ్డి
సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తదితరులుతో కలిసి సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి పట్టణంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన కడ్తాల్ మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు కల్వకుర్తి పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక మైనారిటీ నాయకులతో కలిసి కల్వకుర్తి పట్టణంలో ఉన్న రుక్మొద్దీన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై చేరికలు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ ఇన్చార్జి చీమర్ల అర్జున్ రెడ్డి కాంగ్రెస్లో చేరినట్టు తెలిపారు. సోమవారం ఆమనగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 400 మంది వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరినట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కసిరెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో గెలుపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ గూటికి ముత్తోజు విక్రమ్
మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రైతు సమన్వయ కమిటీ గ్రామ అధ్యక్షులు ముత్తోజు విక్రమ్, ఉపాధ్యక్షులు వెంకటరమణ కాంగ్రెస్ గూటికి చేరారు. సోమవారం ఆమనగల్ పట్టణంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాజశేఖర్ ఆధ్వర్యంలో కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో విక్రమ్, వెంకటరమణ కాంగ్రెస్ లో చేరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు.