రాయదుర్గంలో దారుణ హత్య…

నవతెలంగాణ హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్‌(54) కొండాపూర్‌ వైట్‌ ఫీల్డ్స్‌ విల్లాస్‌లో ఉంటున్నారు. అంజయ్యనగర్‌లో తన కుమారుడు కేశవ్‌ వినయ్‌(28)తో కలిసి సీఎస్‌ డెలాయిట్‌ ఇన్‌ హోటల్‌ నిర్వహిస్తున్నారు. ఆయన హోటల్‌ వెనుక స్టోర్‌ రూం కోసం గది అద్దెకు తీసుకున్నారు. ఏడాది క్రితం స్టోర్‌ రూం ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్‌ చేసి సరకులు దించుకుంటున్నారు. ఆటో ట్రాలీ పార్కింగ్‌ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్‌(35) అనే వ్యక్తి శ్రీనివాస్‌తో గొడవపడ్డాడు. నాడు స్థానికులు అతడినే వారించి గొడవ సద్దుమణిగేలా చూశారు. తన పరువు తీశాడని కక్ష కట్టిన మహేందర్‌ అప్పటి నుంచి అతన్ని అంతమొందించాలనుకున్నాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం హోటల్‌లోకి ప్రవేశించి సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్‌పై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కేశవ్‌, హోటల్‌ సిబ్బంది మహేందర్‌ను అడ్డుకుని శ్రీనివాస్‌ను కేర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11.45కు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్‌ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు మరో కుమారుడు ఉన్నారు. అవివాహితుడైన మహేందర్‌ ఎంబీఏ ఫైనాన్స్‌ చేసి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పినా పెడచెవిన పెడుతుంటాడు.

Spread the love