నేడు క్యాబినెట్ విస్తరణ!

నవతెలంగాణ జైపూర్: నేడు రాజస్థాన్‌(rajasthan)లో మంత్రి విస్తరణ జరగనుంది. సీఎం భజన్ లాల్ శర్మ మంత్రి వర్గంలోకి కొత్త మంత్రులు తీసుకొనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. పలు వర్గాల నుంచి వెలువడిన సమాచారం ప్రకారం ఈ రోజు మొత్తం 18 నుంచి 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారి పేర్లను ఇప్పటివరకు వెల్లడించలేదు. కానీ,  కొత్త మంత్రివర్గం అటు అనుభవజ్ఞులకు ఇటు కొత్తవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. కాగా, క్యాబినెట్ విస్తరణకు ముందు బీజేపీ కేంద్ర నాయకులతో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఢిల్లీ వెళ్లారు.
ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకుగాను బీజేపీ 115 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మొదటి సారి భజన్ లాల్ శర్మను  ముఖ్యమంత్రిగా ఆ పార్టీ ఎంపిక చేసింది. డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలకు అవకాశం కల్పించింది. ఐదో సారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన దేవ్‌నాని 16వ రాజస్థాన్ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. జనవరి 19న గవర్నర్ ప్రసంగంతో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

Spread the love